డీఎస్ఆర్ యాప్తో గ్రామాల్లో జరుగుతున్న పనుల పర్యవేక్షణ
పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సమయ పాలన పాటించేలా చర్యలు
ఉన్నతాధికారుల తనిఖీ సమాచారం సైతం అప్లోడ్
ఆలేరు టౌన్, నవంబర్ 10 : పల్లెల్లో పారదర్శక పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందుకు గానూ డీఎస్ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్ట్) యాప్ను తీసుకు వచ్చింది. పారిశుధ్యం, రికార్డులు, ధృవీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్ బిల్లులు తదితర సమాచారాన్ని యాప్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్ పర్యవేక్షణలో సాగే ఈ యాప్ ద్వారా గ్రామాల్లో కార్యదర్శుల బాధ్యతను మరింత పెంచింది.
యాప్ ద్వారా సమస్త సమాచారం
జిల్లాలో 421 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామస్థాయి సిబ్బంది, అధికారులు సక్రమంగా విధులు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో అన్ని రకాల పనులు త్వరగా పూర్తయ్యేందుకు ఈ యాప్ దోహద పడుతున్నది. కొన్ని సందర్భాల్లో గ్రామ కార్యదర్శులు, సిబ్బంది, ప్రజలకు మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి రావడం లేదు. ఈ యాప్ ద్వారా ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల వరకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన విధులకు సంబంధించిన సమాచారాన్ని యాప్లో పొందు పర్చాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులు సమయానికి వెళ్లి జరుగుతున్న పనులను ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏ గ్రామంలో ఏ మేరకు పనులు జరుగుతున్నాయనే సమాచారం ఉన్నతాధికారులకు చేరుతుంది.
విధి నిర్వహణలో పారదర్శకత
పాత తేదీన తీసిన ఫొటోలు యాప్లో అప్లోడ్ కావు. అందుకే కార్యదర్శులు ఉదయం తాను విధులకు వెళ్లింది మొదలు సాయంత్రం వరకు చేసిన పనులను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ రోజు కార్యదర్శి విధుల్లో లేనట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ మీటింగ్లో, సెలవులో ఉన్నా ఆ సమాచారాన్ని యాప్లో పొందుపర్చాల్సి ఉం టుంది. వారు యాప్లో సమాచారాన్ని పొందు పర్చగానే సిబ్బంది ఎక్కడ ఉన్నదీ లొకేషన్తో సహా ఉన్నతాధికారులకు తెలిసి పోతుంది. గ్రామకార్యదర్శులు చేసిన పనులు ఎంపీడీఓ, ఎంపీఓ డీఎల్పీఓలకు పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే హరితహారం, పల్లెప్రకృతి వనం, శ్మశానవాటికలు, కంపోస్ట్ షెడ్లు, ఉపాధి హామీ పనులు వంటివి డీఎస్ఆర్ యాప్ పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఈఓఆర్డీలు కూడా నిత్యం గ్రామపంచాయతీల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. వారు గ్రామాలకు వెళ్లిన సందర్భాల్లో ఫొలో అప్లోడ్ చేసి లైవ్ లొకేషన్ పంపుతూ నివేదిక రూపొందించాల్సి ఉంటుంది.