యాచారం, జనవరి 11: జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఎలాంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీపీ సుకన్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీ పథకం 13వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ప్రజావేదికను డీఆర్డీవో పీడీ ప్రభాకర్ సమక్షంలో ఎంపీడీవో మమతాభాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి 2021 నవంబర్ వరకు మండలంలో చేట్టిన ఉపాధి హామీ పనులపై గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి గ్రామసభల ద్వారా అవకతవకలను వెలికితీశారు. గ్రామ సభలో చర్చించిన అంశాలను ప్రజావేదిక ద్వారా మండల స్థాయిలో గ్రామాల వారీగా చర్చించారు. మండలంలో రూ. 25,85,60,000ల పనులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో కొన్నింటికి రికార్డులు లేకపోవడం, కూలీలకు పే స్లిప్పులు ఇవ్వకపోవడం, మాస్టర్లో వైట్నర్తో సరిచేయడం తదితర విషయాలను ఎస్ఆర్పీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు స్పష్టం చేశారు. చిన్నచిన్న అవకతవకలు చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి పనికి తగిన రికార్డులను సక్రమంగా నమోదు చేయాలన్నారు. జాబ్కార్డు ఉన్న ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించడంతో పాటు చేసిన పనికి కూలి చెల్లించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, సర్పంచ్ జగదీశ్ నాయక్, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీవో లింగయ్య, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది. ఎస్ఆర్పీలు, కూలీలు ఉన్నారు.