పెద్దేముల్, జనవరి 11 : కంది పంటను జంట సాళ్ల పద్ధతిలో సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు ప్రవీణ్ కుమార్, యుమున అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో రుద్రారం గ్రామానికి చెందిన సేంద్రియ రైతు డి.నారాయణ కంది పంటలో క్షేత్ర దినోత్సవం నిర్వహించి, ఆయా గ్రామాల రైతులకు జంట సాళ్ల పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా గ్రామాల రైతులను ఉద్దేశించి వారు మాట్లాడారు. రైతులు కంది పంటను జంట సాళ్ల పద్ధతిలో సాలు సాలుకు మధ్యదూరం 9 ఫీట్లు, మొక్కకు మొక్కకు మధ్య 1 ఫీటు దూరంతో నాటుకోవాలని సూచించారు. కాగా ఈ పద్ధతిలో ఎకరాకు కిలోన్నర కంది విత్తనాలు సరిపోతాయన్నారు. కందిలో ఎండు తెగులు నివారణ కోసం ట్రైకోడెర్మా పొడితో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా కందిలో గొడ్డు తెగులు నివారణ చర్యల్లో భాగంగా రైతులు బీఎస్ఎంఆర్-736, ఆశా రకాలను సాగు చేసుకోవాలన్నారు. రైతులు కంది పంటలో జంట సాళ్ల పద్ధతి అవలంబించి సేంద్రియ రైతు డి.నారాయణ పాటిస్తున్న విధానాలను పూర్తిస్థాయిలో తెలుసుకుంటే అధిక దిగుబడులను పొందవచ్చని రైతులకు వివరించారు. ఈ సదస్సులో ఏవో నజీరుద్దీన్, ఏఈవో చంద్రకళ, ఆత్మ బీటీమ్ శ్రావణ్, ఏటీఎం కేశవ కృష్ణ, సురేఖ, ఏకలవ్య సంస్థ క్లస్టర్ కోఆర్డినేటర్లు అశోక్, శివకుమార్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.