రూ.50 వేల కోట్లకు చేరిన పెట్టుబడి సాయం
కదలివచ్చిన అన్నదాతలు, టీఆర్ఎస్ శ్రేణులు
ఊరూరా పండుగ వాతావరణం
రంగారెడ్డి, జనవరి 10, (నమస్తే తెలంగాణ) : రైతుబంధు వారోత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. సోమవారంతో రాష్ట్ర రైతులకు అందజేసిన పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లకు చేరింది. దీంతో అన్నదాతలు పండుగ చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు తీశారు. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు గులాబీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపులు నిర్వహించారు. జైతెలంగాణ, జై కేసీఆర్, జై రైతుబంధు నినాదాలతో ఉమ్మడి జిల్లా హోరెత్తింది. పల్లెల్లో జాతర వాతావరణం కనిపించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన ఉత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొని ట్రాక్టర్ నడిపారు. అలాగే ఆయా నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
జిల్లాలో రైతుబంధు వారోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లాలో రైతువేదికల అలంకరణ, విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు, రైతు వేదికల వద్ద ఉత్తమ రైతులకు సన్మానం చేశారు. సోమవారం ఊరూరా, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీగా ర్యాలీలు తీశారు. మహేశ్వరం నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి రైతుబంధు సంబురాల్లో పాల్గొని ట్రాక్టర్ను నడిపించారు. షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు రూ.256.07 కోట్ల సాయం…
రంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 2,76,708 మంది రైతులకుగాను రూ.256.07 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో 3,48,556 మంది పట్టాదారులను రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. నాలుగేండ్లలో రూ.2222 కోట్ల సాయాన్ని జిల్లా రైతులకు అందించింది. 2018 వానకాలం సీజన్లో 2,47,688 మంది రైతులకుగాను రూ.257 కోట్లు, యాసంగిలో 2,21,096 మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 2,30,155 మంది రైతులకుగాను రూ.257 కోట్లు, యాసంగి సీజన్లో 1,87,804 మంది రైతులకుగాను రూ.182 కోట్లు, 2020 వానకాలం సీజన్లో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344 కోట్ల పెట్టుబడిని, 2021 వానకాలం సీజన్లో 2,82,094 మంది రైతులకుగాను రూ.343 కోట్లు, ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు 256 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రైతు బాంధవుడు కేసీఆర్..
రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు, రైతుల పక్షపాతి అయ్యారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంతోపాటు కందుకూరు మండల కేంద్రంలో నిర్వహించిన సంబురాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉన్నారనే భరోసాతో తెలంగాణ రైతాంగం కండ్లల్లో సంతోషం కనిపిస్తున్నదన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడైన సీఎం కేసీఆర్పై పక్క రాష్ర్టాల నేతలు, ముఖ్యమంత్రులు వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని, ఏం చేశారని మాట్లాడుతున్నారో బీజేపీ నేతలు గుండెమీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. మీరు పాలిస్తున్న రాష్ర్టాల్లో రైతుల సంక్షేమం కోసం ఏ పథకాలు అమలు చేస్తున్నారో తెలుపాలని నిలదీశారు. ఢిల్లీలో రైతులను చంపిన పార్టీ నేతలు తెలంగాణ రైతుల విషయంపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రైతుబీమా కింద 70 వేల రైతు కుటుంబాలకు రూ.3500 కోట్లను అందజేశారన్నారు. పంట పెట్టుబడికి ఎకరాకు రూ.10 వేలు అందజేస్తూ నేటితో రూ.50 వేల కోట్ల సాయం అందడంతో ఊరూరా రైతులు సంబురాలు చేసుకుంటున్నారని వివరించారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, జనవరి 10 : వికారాబాద్ జిల్లా పరిధిలో సోమవారం రైతుబంధు వారోత్సవాలు సంబురంగా నిర్వహించారు. ఊరూరా ముగ్గులు వేయడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. రైతులకు రూ.50వేల కోట్ల పెట్టుబడి సాయం అందిన సందర్భంగా రైతుబంధు వారోత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్, కులకచర్లలలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పాల్గొన్నారు. ఎడ్లబండిపై ర్యాలీలు నిర్వహించి రైతువేదికల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కెపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతుగా పొలం దున్నారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని రైతులను సన్మానించారు. మార్కెట్యార్డులో వేసిన ముగ్గులను పరిశీలించారు. నవాబుపేట్ మండలం ఎల్లకొండలో జరిగిన రైతుబంధు సంబురాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. కొడంగల్ మండలంలోని పర్సాపూర్లో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎడ్లబండిపై ఊరేగింపులో పాల్గొనడంతోపాటు మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. జిల్లా పరిధిలోని రైతువేదికలలో రైతులతో వ్యవసాయాధికారులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా క్లస్టర్ల పరిధిలో ఉత్తమ రైతులను సన్మానించారు.