ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రికాషినరీ డోస్ వ్యాక్సినేషన్
మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలో 164 మంది, వికారాబాద్ జిల్లాలో 233 మంది ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా పంపిణీ
పరిగి, జనవరి 10 : వికారాబాద్ జిల్లాలో 27 కేంద్రాల్లో సోమవారం తొలి రోజు 233 మందికి బూస్టర్ డోసు వేశారు. గత శనివారం నుంచే బూస్టర్ డోసు కోసం కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకోనివారు నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి బూస్టర్ డోసు వేసుకోవచ్చు. మొదటి రోజు తక్కువ మంది బూస్టర్ డోసు తీసుకోగా.. రెండో రోజు నుంచి ఈ కార్యక్రమం మరింత వేగంగా నిర్వహించి సాధ్యమైనంత వరకు అత్యధిక మందికి బూస్టర్ డోసు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇదిలాఉండగా సోమవారం వికారాబాద్ జిల్లా పరిధిలో 15 నుంచి 17 ఏండ్ల లోపువారు 2663 మంది మొదటి డోసు టీకా వేయించుకున్నారు. అలాగే 18 ఏండ్లు పైబడినవారిలో మొదటి డోసు 739 మంది, రెండో డోసు 5366 మంది వేయించుకున్నారు.
కరోనా నిబంధనలు పాటించాలి
షాద్నగర్, జనవరి 10 : కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో నివారించేందుకు చేపట్టిన కరోనా బూస్టర్ డోస్ టీకా జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లావ్యాప్తంగా 164 మందికి వేశామని జిల్లా వైద్య సిబ్బంది తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి బూస్టర్ టీకాను వేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాలవారికి టీకీ అందుతుందని చెప్పారు. అదేవిధంగా 15 నుంచి 18 ఏండ్ల యువతకు 7,090 మందికి కరోనా సాధారణ టీకాలు, 9,955 మందికి రెండో టీకాను వేశామని వివరించారు. కరోనా వ్యాప్తి నివారణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, కచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలను కోరారు.