షాబాద్, జనవరి 9;ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కర్షకలోకం, టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం నిర్వహించిన రైతుబంధు సంబురాలు కన్నుల పండుగగా సాగాయి. పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు రైతాంగం కృతజ్ఞత తెలుపుతూ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో తీసిన ర్యాలీలు కనువిందు చేశాయి. ఈ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొని రైతు సంక్షేమం కోసం రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఊరూరా ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’, ‘జై రైతుబంధు’ ‘జై కిసాన్’.. అన్న నినాదాలు మార్మోగాయి. రైతుబాంధవుడు కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి రైతులు, పార్టీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పల్లెలు, పంచాయతీలు, ప్రధాన కూడళ్లు, రైతువేదికల వద్ద ఆడబిడ్డలు వేసిన రంగవల్లులు చూపరులను ఆకట్టుకున్నాయి.
ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు అందజేస్తున్న పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లకు చేరిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని తాండూరులో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటం వేసి, ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం పట్లూరులో రైతుబంధు వారోత్సవాల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. గ్రామంలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్, దేవర్ఫస్లాబాద్ గ్రామాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొని వారోత్సవాలు నిర్వహించారు. పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండలం వీరాపూర్లో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఎడ్లబండ్ల ర్యాలీ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి ఉత్సాహంగా ఉత్సవాలు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాలో..
షాబాద్, జనవరి 9 : టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో రూ. 50వేల కోట్లకు పైగా రైతుబంధు సాయం జమ కానున్న సందర్భంగా నిర్వహిస్తున్న సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాలోని షాద్నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. నందిగామ మండలం చేగూర్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ తదితరులు పాల్గొని సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, పార్టీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించారు.