సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ మాఫీ
ఉద్యమి మిత్ర పోర్టల్లో నమోదు
హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు
జూబ్లీహిల్స్,జనవరి9: కరోనాతో కుదేలైన చిరు వ్యాపారులకు పీఎం స్వానిధి పథకంలో మళ్లీ రుణాలు అందజేస్తున్నారు. నిర్ణీత సమయంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీతో పాటు రూ.10 వేలకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డ వీధి వ్యాపారులకు కొవిడ్ రుణాలు అందజేశారు. జీహెచ్ఎంసీ గుర్తింపు కార్డులున్న స్ట్రీట్ వెండర్స్కు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు. కాగా ఈ రుణాలు పొందిన లబ్ధిదారులు నిర్ణీత 12 నెలల వ్యవధిలో, అంతకంటే ముందుగా రుణాలు తిరిగి చెల్లిస్తే వారికి పూర్తిగా వడ్డీ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వనున్నారు. రుణాలు తిరిగి చెల్లించిన వారికి వడ్డీ తిరిగి చెల్లించడంతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మళ్లీ రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకుగానూ వీధి వ్యాపారులందరిని ఉద్యమి మిత్ర పోర్టల్లో నమోదు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ గుర్తింపు కార్డులున్న వారితో పాటు రుణాలు పొందిన వీధి వ్యాపారులను ఈ పోర్టల్తో లింక్ చేయడం వల్ల రెండో విడుత రుణాలు సులువుగా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్థికంగా ఎదగాలి
రుణాలు తిరిగి చెల్లించిన వారికి రూ.20 వేలు ఇస్తు న్నాం. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బ్యాంక్ లింకేజీ రుణాలిస్తు న్నాం. చిరు వ్యాపారులు ఆర్థికంగా ఎదగాలి. అతి తక్కువ వడ్డీతో అందిస్తున్న రుణాలు తిరిగి చెల్లించి రెండో విడుత రుణాలు తీసుకోవచ్చు.
-హిమబిందు, డిప్యూటీ పాజెక్ట్ ఆఫీసర్
రూ.10 వేల చొప్పున అందజేశాం
చిరువ్యాపారులందరికీ జీహెచ్ఎంసీ ఆధ్వ ర్యంలో బ్యాంక్ లింకేజీ రుణాలు ఇస్తున్నాం. కరోనా సమయం లో సుమారు 1500 మంది వీధి వ్యాపారులకు రూ. 10 వేల చొప్పున రుణాలు అందజేశాం. తిరిగి చెల్లించిన వారికి రెట్టింపు రుణాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం.
-రమేశ్,డిప్యూటీ మున్సిపల్ కమిషనర్