శబ్దం రాకుండా చెప్పులు కూడా వేసుకోడు..
గ్లౌసులు, మాస్కు ధరిస్తాడు..
బైక్ను అరకిలోమీటర్ దూరంలో పార్కింగ్ చేస్తాడు
రాత్రి వేళ కాలనీల్లో రెక్కీ..
చేసేది పూల వ్యాపారం..ప్రవృత్తి దొంగతనాలు
చోరీ సొత్తుతో బెట్టింగ్లు
ఖరీదైన భవనాలే లక్ష్యం…
పాతనేరస్తుడి లూటీ పర్వం
నిందితుడితో పాటు మరో వ్యక్తి అరెస్టు
1.805 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం
రూ. 93,62,500 విలువైన సొత్తు రికవరీ
సిటీబ్యూరో/నేరేడ్మెట్, నవంబర్ 27 : ఖరీదైన భవనాలే అతడి లక్ష్యం.. కన్నుపడిందంటే.. దోచుకోవడం ఖాయం.. చోరీ కేసుల్లో అనేకసార్లు జైలుకు వెళ్లొచ్చినా.. బుద్ధి మార్చుకోలేదు.. నేరప్రవృత్తిని కొనసాగిస్తున్నాడు. ఒకవైపు పూల వ్యాపారం చేస్తూ.. క్రికెట్ బెట్టింగ్లకు బానిసగా మారి దొంగతనాలకు తెగబడుతున్నాడు. రాత్రి వేళ కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తూ ..ఖరీదైన ఇండ్లలో లూటీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు గఫర్ఖాన్ను ఎల్బీ నగర్ సీసీఎస్, సరూర్నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడిని నుంచి 1.805 కిలోల బంగారు ఆభరణాలతోపాటు రూ.1.90 లక్షల నగదు, బైక్, పది మొబైల్ ఫోన్లు మొత్తం రూ.93,62,500 విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్భగవత్ వివరాలను వెల్లడించారు.
కాంపౌండ్ వాల్ దూకి..
యాకుత్పురకు చెందిన గఫర్ఖాన్ అలియాస్ జిగర్(28) పూల వ్యాపారి. అతడిపై ఇప్పటివరకు 27 చోరీ కేసులున్నాయి. గతంలో మలక్పేట పోలీసులు పీడీయాక్ట్ను కూడా ప్రయోగించారు. జైలుకెళ్లొచ్చినా.. నేరప్రవృత్తిని మానలేదు. రాత్రి వేళ బైక్పై కాలనీల్లో రెక్కీ నిర్వహించి.. విల్లాలు, డూప్లెక్స్ వంటి ఖరీదైన ఇండ్లను ఎంచుకుంటాడు. చోరీ చేసే ఇంటికి సుమారు అరకిలోమీటర్ దూరంలో బైక్ పార్కింగ్ చేస్తాడు. శబ్దం రాకుండా కాళ్లకు చెప్పులు కూడా వేసుకోడు. మాస్క్, గ్లౌజ్లు ధరిస్తాడు. కాంపౌండ్ వాల్ దూకి.. కిటికిల్లోంచి చేతులు పెట్టి.. ప్రధాన ద్వారం తెరిచి..లోపలికి ప్రవేశిస్తాడు. విలువైన బంగారు, వెండి ఆభరణాలు తస్కరించి..ఎలా వచ్చాడో అలాగే బండిపై పారిపోతాడు. ఈనెల 19న అర్ధరాత్రి దాటిన తరువాత సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో 70 తులాల బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఈ కేసులో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా, కొన్ని ఆధారాలు లభించడంతో దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో 27న సరూర్నగర్ చెరువు సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, బైక్పై వెళ్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించారు. తన పేరు గఫర్ఖాన్ అని చెప్పి..నేరాలను ఒప్పుకోవడంతో అరెస్టు చేశారు.
చోరీ డబ్బులతో క్రికెట్ బెట్టింగ్లు
తస్కరించిన సొత్తును గఫర్ఖాన్ యాకుత్పురకు చెందిన గోల్డ్ పాలిషింగ్ పనులు చేసే సయ్యద్ ఖాజాపాషా(32)కు విక్రయిస్తాడు. వచ్చిన డబ్బులతో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతుంటాడు. ఒకసారి బెట్టింగ్లో లక్ష రూపాయలు రావడంతో ఆ మోజులో పడి.. ఇప్పటివరకు రూ. 15 లక్షలను పోగొట్టుకున్నాడని తేలింది. సయ్యద్ ఖాజాపాషాను కూడా అరెస్టు చేసినట్లు సీపీ మహేశ్భగవత్ తెలిపారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని అభినందిస్తూ నగదు రివార్డులను అందజేశారు.