సూర్యాపేట టౌన్, నవంబర్ 8 : దేశ రక్షణలో యువత భాగస్వామ్యం కావాలని, అందుకు కల్నల్ సంతోష్బాబును స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి కోరారు. ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఎస్వీ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం ఉదయం నిర్వహించిన ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడుతూ జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో తొలిసారి నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన స్పందన అనూహ్యమైందని అన్నారు. పట్టణానికి చెందిన దివంగత సంతోష్బాబు త్యాగంతో ప్రపంచ చిత్రపటంలో సూర్యాపేటకు చోటు దక్కిందన్నారు. అటువంటి సంతోష్బాబును స్ఫూర్తిదాయకంగా పెట్టుకొని ఈనాటి ర్యాలీకి తరలివచ్చిన వారందరిని అభినందించారు. అంతకుముందు దివంగత కల్నల్ సంతోష్బాబు చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించచారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ కల్నల్ ఎస్.శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, స్థానిక కౌన్సిలర్ అనంతుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అపూర్వ స్పందన
జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1962మంది యువత ర్యాలీలో పాల్గొనగా 274మంది ఎంపికయ్యారు. వీరికి సూర్యాపేట జిల్లా కేంద్రంగా డిసెంబర్ 1 నుంచి రెండు నెలల పాటు శిక్షణ ఉండనుంది.