యాదాద్రి, డిసెంబర్ 7 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ఆకుపూజ పర్వాలు మంగళవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండపైన భక్తుల నూతన క్యూకాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు. వేదమంత్ర పఠనంతో ఆంజనేయ స్వామికి సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించారు. తమలపాకులతో అర్చించడంతో పాటు, వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితా పారాయణము చేసి, ఆంజనేయ స్వామి కి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. బాలాలయంలో నరసింహ స్వామికి నిత్యపూజలు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామి వారి బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.13,50,020 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.