నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) వ్యవహరిస్తున్న తీరు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర ఆటంకంగా మారుతున్నది. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్గా సేకరించడంలో ఎఫ్సీఐ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండడంపై జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సీఎంఆర్ను వెంట వెంటనే సేకరించకపోవడంతో మిల్లుల్లో యాసంగి ధాన్యం పేరుకుపోతున్నది. దాంతో ప్రస్తుత వానకాలంలో కొనుగోలు చేస్తున్న ధాన్యానికి మిల్లుల్లో స్థలం లేక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాసంగి సీఎంఆర్ సేకరణకు అవసరమైన గోదాములు తీసుకుని, వాటిల్లోని బాయిల్డ్ రైస్ను వెంటవెంటనే రైల్వే వ్యాగన్లు తెచ్చి ఎగుమతులు చేస్తే ఈ బాధలు ఉండేవి కావు.
సమైక్య రాష్ట్రంలో సాగునీటికి గోసపడ్డ జిల్లా స్వరాష్ట్రంలో అనతికాలంలోనే రాష్ట్రంలోనే అత్యధిక వరిసాగు జిల్లాగా అవతరించింది. గత రెండు మూడేండ్లుగా అంతకంతకూ పెరుగుతున్న సాగుతో ధాన్యం ఉత్పత్తి ఘననీయంగా పెరిగింది. సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుండడం విశేషం. అయితే ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వ తీరు జిల్లా రైతాంగం పట్ల ఆశనిపాతంలా మారింది. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ చేసిన కేంద్రం ప్రకటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహం గతంలో జిల్లాకు వచ్చిన బీజేపీ నేత బండి సంజయ్ పర్యటనలో స్పష్టంగా వెల్లడైంది. ఇక ఇదే సమయంలో ప్రస్తుత వానాకాలం కొనుగోళ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం, దాని పరిధిలోని ఎఫ్సీఐ తీరు తీవ్ర ఆటంకంగా మారుతుంది. ఈ సీజన్లోని ప్రతీ గింజా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే… దాన్ని ముందుకు సాగకుండా ఎఫ్సీఐ అడ్డుపడుతున్నది. అందుకు కారణం గత యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం నుంచి బియ్యాన్ని సేకరించకపోవడమే. ఎఫ్సీఐ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎఫ్సీఐ తీరుతో సీఎంఆర్ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
నల్లగొండ జిల్లాలో యాసంగిలో మొత్తం 8.52 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం కొనగా దాన్ని నుంచి 5.79 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్గా సేకరించాల్సి ఉంది. కానీ ఎఫ్సీఐ తీరుతో నేటికి 3.68 లక్షల మెట్రిక్ టన్నులే ఇవ్వగలిగారు. అందుకు వెంటవెంటనే బియ్యాన్ని ఎఫ్సీఐ సేకరించకపోవడమే ప్రధాన కారణం. జిల్లాలో రోజూ 8 వేల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసే సామార్ధ్యం ఉంటే కేవలం 3 వేల టన్నులనే ఎఫ్సీఐ తీసుకుంటుంది. దీంతో మిల్లుల్లో ఉన్న యాసంగి ధాన్యం ఖాళీ కావడంలో ఆలస్యం జరుగుతుంది. దీంతో పాటు బియ్యాన్ని తరిలించేందుకు జిల్లాకు నెలకు 40 రైల్వే వ్యాగన్లు అవసరం కాగా కేవలం 15 కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ సారి ప్రైవేటు గోదాంలు ఎఫ్సీఐ లీజుకు తీసుకోకపోవడం వల్ల ఉన్న రెండు గోదాంలు ఫుల్గా బియ్యం నిల్వ ఉన్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న ధాన్యంతో మిల్లులు ఖాళీ కాక, ప్రస్తుత వానాకాలం కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వెంటవెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ఎఫ్సీఐ తీరు తీవ్ర ఆటంకంగా మారుతుంది. ఇదే పరిస్థితి సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోనూ నెలకొంది.
సూర్యాపేట జిల్లాలో ఇలా..
సూర్యాపేటలో యాసంగిలో సేకరించిన ధాన్యం నుంచి 4.52 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్గా అప్పగించాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు కేవలం 1.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇవ్వగలిగారు. ఇంతటి జాప్యానికి ఎఫ్సీఐ తీరే కారణమన్నది స్పష్టం. జిల్లాలో 72 మిల్లులు సీఎంఆర్ బియ్యాన్ని రోజూ 4 వేల టన్నులను ఉత్పత్తి చేసే సామార్ధ్యం కలిగి ఉన్నాయి. కానీ 2 వేల టన్నులను మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ సీఎంఆర్ బియ్యం సేకరణకు ఎఫ్సీఐ సరైన గోదాంలను తీసుకోలేదు. దీనికి తోడు రైల్వే వ్యాగన్లు ఇక్కడ అప్పుడో ఇప్పుడో అన్నట్లే కొనసాగుతుంది. అందువల్ల ఇక్కడ కేవలం ఇప్పటికీ 37 శాతమే కావడం గమనార్హం. ఎఫ్సీఐ విధించిన గడువు ప్రకారం ఈ నెల 31వ తేదీ వరకు మిగతా 63 శాతం సీఎంఆర్ ఎలా సాధ్యమనేది సమాధానంలేని ప్రశ్నగా మిగిలింది.
యాదాద్రిభువనగిరి జిల్లాలో ఒక్కటే ఎఫ్సీఐ గోదాం..
యాదాద్రి జిల్లాలో యాసంగిలో 292 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు మిల్లర్లకు అప్పజెప్పింది. మిల్లర్ల వద్ద నుంచి సీఎంఆర్ రూపంలో 2.89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి అప్పజెపాల్సి ఉంది. జిల్లాలో 30 వరకు మిల్లులు ఉండగా రోజూ కేవలం 1,850 టన్నుల బియ్యాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఎఫ్సీఐ సహకరిస్తే పూర్తిస్థాయిలో మిల్లింగ్కు అవకాశం ఉంది. ఎఫ్సీఐ తీరుతో ఇప్పటివరకు 1.27లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అప్పగించగలిగారు. ఇక నెలకు 20 రైల్వే వ్యాగన్లు అవసరం కాగా కేవలం 4 వ్యాగన్లు మాత్రమే పంపిస్తున్నారు. ఈ జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వచేసే గోదాంల స్థలం ఉన్నా కేవలం నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్న 75 వేల మెట్రిక్ టన్నుల గోదాంను మాత్రమే ఎఫ్సీఐ తీసుకుంది. దీంతో సీఎంఆర్ చేసిన బియ్యాన్ని మిల్లుల నుంచి తరలించడానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడి ఒక్కో గోదాం వల్ల లారీలు దిగుమతులు కాకుండా 20 రోజులకు పైగా పడుతుంది. దీనంతటికీ ఎఫ్సీఐ నిర్లక్ష్య వైఖరే కారణమని స్పష్టం అవుతుంది.
నేడు నల్లగొండలో గవర్నర్ పర్యటన..
రామగరి, డిసెంబర్ 7 : రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ బుధవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 9:50కి రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరతారు. 11 గంటల 15 నిమిషాలకు నల్లగొండ గడియారం సెంటర్లోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని 11:35కు పాతబస్తీ శేర్బంగ్లాలోని సంతోషిమాత ఆలయానికి చేరుకుంటారు. ధ్వజస్తంభ, విగ్రహప్రతిష్ఠోత్సవాల్లో పాల్గొంటారు. 12:10 ఆర్అండ్బీ అతిథి గృహంలో భోజనం చేసి ఒంటిగంటకు ఆర్జాలబావి, దుప్పలపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తారు. ఒంటిగంట 40 నిమిషాలకు తిరుగు ప్రయాణమై 3 గంటలకు రాజ్భవన్ చేరుకుంటారు.