కేతేపల్లి, డిసెంబర్ 7;మండలంలోని కొత్తపేట గ్రామంలో సాకెరబండ వాగుపై దశాబ్దాలుగా కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేతేపల్లి, కొత్తపేట గ్రామాల రైతులు తమ పొలాల వద్దకు వాగు దాటి వెళ్లాల్సి వచ్చేది. భారీగా వర్షాలు పడిన సమయంలో కనీసం పొలాల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఈ నేపథ్యం లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో వాగుపై కల్వర్టు నిర్మించడంతో రైతుల కష్టాలు తీరాయి.
కొత్తపేట సాకెరబండ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని రైతులు గతంలో అనేకమార్లు ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు అలుగు వద్ద భారీగా గండి పడింది. దాంతో రెండు నెలలు రైతులు కాలి నడకన పొలాల వద్దకు వెళ్లలేక అవస్థలు పడ్డారు. రైతుల ఇబ్బంది తెలుసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. దాంతో ప్రతిపాదనలు పంపడంతో ఎమ్మెల్యే చిరుమర్తి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.6 లక్షలు కేటాయించడంతో మినీ కల్వర్టు, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.గండిపడ్డ ప్రదేశాన్ని మట్టితో పూడ్చివేశారు. దీంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.