గుర్రంపోడు/డిండి, డిసెంబర్ 7 ;వానకాలం వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నది. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాంటా వేసిన వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు. రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ వారి ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటున్నారు.
10.5వేల ఎకరాల్లో సాగు
గుర్రంపోడు మండలంలో వానకాలంలో 10,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో గుర్రంపోడు, జిన్నాయిచింత, కొప్పోలు, చేపూర్ గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 40 వేల క్వింటాళ్లను కొనుగోలు చేశారు. మరో 50వేల క్వింటాళ్లు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి దొడ్డు రకంతో పాటు సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
19వేల క్వింటాళ్లు కొనుగోలు
డిండి మండలంలో వానకాలం సీజన్లో 16,285 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 7,159 ఎకరాల్లో దొడ్డు రకం, మరో 9,126 ఎకరాల్లో సన్నరకం వేశారు. సుమారు 30 వేల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు, వాటిని కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 386 మంది రైతుల నుంచి 19,226 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు బస్తాల్లో నింపి లారీల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు.
వారం రోజుల్లోనే డబ్బు జమ
మండలంలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం. ప్రతి కేంద్రంలో కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ధాన్యాన్ని పొలాల వద్దే ఆరబెట్టుకొని తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.