వాలీబాల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ, గురుకుల విద్యార్థులు
ఈ నెల 30 వరకు పోటీలు
రామగిరి, డిసెంబర్ 7 : విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయిలో రాణించేలా మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో వర్సిటీ, ఉమ్మడి జిల్లాలోని అనుబంధ కళాశాలల క్రీడాకారులకు యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్(ఐసీటీ)2021-22ను నిర్వహిస్తున్నది. ఈ నెల 30 వరకు 23 అంశాల్లో జరిగే క్రీడల్లో భాగంగా మంగళవారం ఎంజీయూలోని క్రీడామైదానాల్లో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విద్యార్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 కళాశాలల నుంచి 28 టీమ్లు రాగా, వీరిలో 13 మహిళలు, 15 పురుషుల టీమ్స్ పాల్గొన్నాయి. వీటిలో ప్రభుత్వ, గురుకుల కళాశాలలకు చెందిన విద్యార్థులు హవా కొనసాగించారు. ఉదయం వీసీ సీహెచ్ గోపాల్రెడ్డి ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డా.జి.ఉపేందర్రెడ్డితో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎంజీయూ ఖ్యాతిని చాటాలని పిలుపునిచ్చారు. రాత్రి వరకు సాగిన క్రీడల్లో మహిళల పోటీలు ముగియగా ప్రథమ బహుమతి ఎన్జీ కళాశాల-నల్లగొండ, ద్వితీయ బహుమతి టీటీడబ్ల్యూఆర్డీసీ ఉమెన్స్- సూర్యాపేట కైవసం చేసుకున్నారు. వీరికి వీసీ బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఎంజీయూ పీడీలు డా॥ వై.శ్రీనివాస్రెడ్డి, డా॥ ఆర్.మురళీ, ఉమెన్స్ కళాశాల పీడీ కల్యాణి, ఆయా కళాశాలల విద్యార్థులు, పీడీలు పాల్గొన్నారు.