నల్లగొండ రూరల్, డిసెంబర్ 7 : సాయుధ దళాల పతాక దినోత్సవంను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తన క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు. అనంతరం సైనిక సంక్షేమ అధికారి, సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు కలిసి ఎస్పీ రంగనాథ్, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, చంద్రశేఖర్, ఏఎస్పీ నర్మదతో పాటు ఇతర ప్రముఖుల వద్దకు వెళ్లి వారికి స్టిక్కర్ ఫ్లాగ్ను అందించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మగ్బూల్ అహ్మద్ మాట్లాడుతూ సాయుధ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 31 వరకు విరాళాలు సేకరించనున్నట్లు తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారి కుటుంబాలకు సహాయార్థం జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.