వైరస్ నివారణపై ప్రజల్లో చైతన్యం తేవాలి
నిర్మల్ జడ్పీ మీటింగ్లో చైరపర్సన్ విజయలక్ష్మి
ఆదిలాబాద్లో అధికారుల సమీక్షలో చైర్మన్ రాథోడ్ జనార్దన్
పాల్గొన్న నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్
నిర్మల్ టౌన్, మే 7: జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజాప్రతినిధులు కూడా పల్లెల్లో కొవిడ్ నివారణపై ప్రజల్లో చైతన్యం చేయాలని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని దివ్య గార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా కరోనా వైరస్తో ఇటీవల మృతి చెందిన ప్రజాప్రతినిధులకు సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎజెండాలోని అంశాలపై సభ్యులు చర్చించారు. జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామన్నారు. 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదటి, రెండో దశలో పూర్తి చేశామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతుండడంతో ప్రజలు కరోనా వైరస్ బారిన పడుతున్నారని పలువురు జడ్పీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే రెండో దశ టీకా పంపిణీ ఉంటుందని కలెక్టర్ తెలిపారు.అన్ని మండలాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా చేపట్టాలని జడ్పీటీసీలు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, జీవన్రెడ్డి తదితరులు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను జడ్పీ చైర్పర్సన్ వివరించారు. నిర్మల్, ఖానాపూర్, భైంసాలో ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాలతో పాటు కొవిడ్ అత్యవసర చికిత్స కోసం వెంటిలేటర్, ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చాలా మంది ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొంది వైరస్ బారి నుంచి కొలుకుంటున్నారని తెలిపారు. చాలా గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుంటున్నారని, ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ ఉందని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు పేర్కొన్నారు. నిర్మల్ ఏరియా దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి తెలిపారు. ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకుంటున్న వారి నుంచి అధిక ఫీజులు, పరీక్షల పేరుతో దోపిడీ చేస్తున్నారని పలువురు సభ్యులు అధికారులు దృష్టికి తెచ్చారు. దీనిపై జిల్లాలో ప్రత్యేక తనిఖీ బృందం ఏర్పాటు చేశామని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పథకాలను వేగంగా పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కలెక్టర్ సూచించారు.
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 197 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 120 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని డీఎస్వో కిరణ్కుమార్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, అధికారులు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.