కరోనా బాధితులు అధైర్యపడవద్దు
ఇంటి వద్దే ఉండి జాగ్రత్తలు పాటించాలి
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత
దుమ్ముగూడెం/ పర్ణశాల/ చర్ల, జూన్ 6: కరోనా బాధితులు అధైర్యపడొద్దని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్యం సాధారణంగా ఉంటే ఇంటి వద్దనే ఉంటూ జాగ్రత్తలు పాటించాలని, టైం ప్రకారం కిట్లు వాడాలని సూచించారు. భద్రాచలం ఏజెన్సీ మండలాల్లో ఆదివారం ఆమె విస్తృతంగా పర్యటించారు. తొలుత రామచంద్రునిపేటలో 15 కుటుంబాల్లోని కరోనా బాధితులకు నిత్యావసరాలను అందజేశారు. అనంతరం లక్ష్మీనగరంలోని రేగుబల్లి ఆశ్రమ పాఠశాలలో ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. దుమ్ముగూడెం పీహెచ్సీని సందర్శించారు. అక్కడే నలుగురు బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రమౌళి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
పర్ణశాలలో..
పర్ణశాల పంచాయతీలో ఉన్న ముసలిమడుగు గ్రామానికి వెళ్లిన ఎంపీ మాలోతు కవిత.. అక్కడ 45 మంది కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చర్ల పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా దుమ్ముగూడెం అడ్డరోడ్డు వద్ద టీఆర్ఎస్ నాయకుడు రమేశ్ ఎంపీ కవితకు శాలువా కప్పి సన్మానించారు. దబ్బనూతల గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు వెచ్చించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చలపతి బందోబస్తు నిర్వహించారు.
చర్లలో సీహెచ్సీ నిర్మాణానికి కృషి..
చర్లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు కృషిచేస్తానని మహబూబాబాద్ ఎంపీ కవిత అన్నారు. చర్లలోని సిమాంక్ సెంటర్ను ఆదివారం ఆమె సందర్శించారు. బాధితులకు పాలు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాధాన్యం, అదనపు వైద్యుల నియామకం గురించి మంత్రి అజయ్తో చర్చిస్తానన్నారు. పలు సమస్యలపై టీఆర్ఎస్ నేత నక్కిబోయిన శ్రీనివాసరావు వినతిపత్రం సమర్పించారు. చర్ల సహకార సంఘ అధ్యక్షుడు పరుచూరి రవికుమార్, సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, సోయం రాజారావు, బండి వేణు తదితరులు పాల్గొన్నారు.