కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు
పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు
మలక్పేట, డిసెంబర్ 4 : మూసారాంబాగ్ డివిజన్లో కొనసాగుతున్న కమ్యూనిటీహాళ్ల నిర్మాణం నిర్ణీత కాలవ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఈ రాధిక ఏఈ గుండ్రపల్లి వేణుగోపాల్కు సూచించారు. రూ.25.50 లక్షలతో శ్రీపురం కాలనీలోని దోబీఘాట్లో నిర్మిస్తున్న రజకసంఘ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణపనులను శనివారం ఏఈ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీవాసుల సౌకర్యార్థం ప్రతి కాలనీలో కమ్యూనిటీహాళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ అనేక కాలనీల్లో కమ్యూనిటీహాళ్లను నిర్మించటం జరిగిందని, కొన్ని కాలనీల్లో పనులు నిర్మాణదశలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం వచ్చిన నిధులతో రజక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టామన్నారు. పనులు పూర్తయ్యేందుకు మరిన్ని నిధులు అవసరం పడితే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. ఏఈ గుండ్రపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ.. వచ్చిన నిధులతో పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం కమ్యూనిటీహాల్ నిర్మాణం స్లాబ్ దశలో ఉందని, ఇది పూర్తయితే మిగతాపనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మావురపు నర్సింహ, రజక సంఘ నాయకులు, కాంట్రాక్టర్ రాము పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
చాదర్ఘాట్, డిసెంబర్ 4 : ఆజంపురా డివిజన్లోని తాగునీటి సమస్య పరిష్కారానికి జలమండలి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా పైపులైన్ లను ఏర్పాటు చేస్తున్నారు. బోధి అలీషా ఖిడికీ వద్ద శ్రీనివాస హోటల్, రాజునర్సింహా నగర్, ఫర్హత్నగర్, ఉస్మాన్పురా, కట్టెలగూడ, ఉప్పరబస్తీ ప్రాంతాల్లో నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు 250/200 ఎం.ఎం. డయా సామర్థ్యంతో కొత్తగా పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఆజంపురాలోని వివిధ బస్తీలో జలమండలి అధికారి మహేశ్ , ఎంఐఎం నాయకుడు, షేక్ మొహియుద్దీన్ అబ్రార్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. పైపులైన్ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్రార్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు పైపులైన్ సామర్థ్యం పెంచి మెరగైన సరఫరా కోసం పనులు పూర్తి చేయిస్తున్నట్లు తెలియజేశారు.
మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి
మౌలిక సదుపాయాలు కల్పించి డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ఛావునీ కార్పొరేటర్ ఎం.ఎ.సలాం షాహీద్ అన్నారు. శనివారం ఛావునీలో వరద నీటి కాలువ పైపులైన్ మ్యాన్హోళ్ల క్యాచ్పిట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. వరద ముంపు సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కోసం స్ట్రాం వాటర్ డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాల చొరవతో డివిజన్లో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో స్థానికులు, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.