ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం : మంత్రి ఐకేరెడ్డి
నిర్మల్ అర్బన్ / నిర్మల్ టౌన్, జూన్ 2: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ముందుగా.. అమరవీరుల స్తూపం, జయశంకర్ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను కొనియాడారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తున్నదని మంత్రి, విప్ పేర్కొన్నారు. కాగా.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో తెలంగాణ జలసిరితో కళకళలాడుతున్నదని తెలిపారు.
దేశ చరిత్రలో రైతు బంధు కొత్త అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. రైతుబంధు పథకానికి ఏటా రూ.15వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. రైతు బీమా, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కంటి వెలుగు పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతున్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు కూడా చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇప్పటికే కొత్త జిల్లాలో వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నిర్మల్లో రెండేళ్లలోనే 60 ఏండ్లలో లేని ప్రగతిని సాధించిందని, ఇందుకు నిదర్శనం పట్టణంలో ఏర్పాటు చేసుకున్న ఆర్చ్లు, ఫౌంటెన్లు, కమాన్లు, సెంట్రల్ లైటింగ్, భారీ జాతీయ జెండాలే నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, జిల్లా అటవీ శాఖ అధికారి విక్రమ్సింగ్, జిల్లా మహిళా సంక్షేమ అధికారి స్రవంతి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, మంత్రి సతీమణి అల్లోల విజయలక్ష్మి, కోడలు దివ్యారెడ్డి, నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
భారీ జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి
నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన 150 అడుగుల భారీ జాతీయ జెండాను రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి
నిర్మల్ అర్బన్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో జిల్లాలో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. పట్టణంలో రూ.6 కోట్లతో సుందరీకరణ పనులు సాగుతున్నాయని, పనులు పూర్తయితే పట్టణానికి నూతన కళ రానుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, యువ నాయకులు అల్లోల గౌతమ్రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, నాయకులు మల్లికార్జున్రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు వేణు, రాంకిషన్ రెడ్డి, భూషణ్ రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.