ఇంతకు ముందు పత్తి, వరి పెడుతుండె..
ఇప్పుడు మిర్చికి పూత, కాత ఇరగకాసింది..
మొక్కలు ఆరోగ్యంగా ఉండడంతో నమ్మకం కలిగింది.
నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ రైతు జోగయ్య
నర్సాపూర్, డిసెంబర్ 1 : ‘సీఎం సారు వరి కాకుండా వేరే పంటలను వేయాలని చెప్పిండు.. అందుకే ఈ సారి నాకున్న 30గుంటల్లో మిర్చి వేసిన. మొదట్లో పంటపై నమ్మకం కలుగలేదు.. మిరప నారు నాటేసిన కొన్ని రోజులకు మొక్కలు కనపడడంతో పంటపై నమ్మకం కలిగింది. కూలీలతో గడ్డిని కలిపించిన. టైంకు నీళ్లు పెడుతున్న. ఇప్పుడు మొక్కలు పెద్దగా పెరిగి కాయలు కాస్తున్నాయి. ఈ పంటలో లాభం వస్తే, ఎప్పుడు ఇదే పంట వేస్తా. ఈ పంటకు కోతులతో పెద్దగా సమస్య ఉండదు’. అని నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ రైతు జోగయ్య పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను పండించాలని రైతులకు సలహా ఇవ్వడం, వ్యవసాయాధికారుల సూచనలతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారు. చుట్ట్టు పక్కల రైతులు వరిని కాకుండా వేరే పంటలను వేయడాన్ని జోగయ్య గమనించాడు. తాను కూడా ప్రత్యామ్నాయ పంట పండించాలని నిర్ణయించాడు. తనకు ఎలాంటి అనుభవం లేకున్నా ప్రభుత్వ సలహా మేరకు పచ్చి మిరప పంటను సాగు చేయడానికి ముందుకొచ్చాడు. మొదట్లో మిర్చినారు తెచ్చి, తనకు ఉన్న 30 గుంటల భూమిలో నాటు వేశాడు. మొదట్లో పెద్దగా శ్రద్ధ లేకుండా పంటను వేశాడు. కానీ, పంట మొక్కలు పూర్తి ఆరోగ్యంగా మొలకెత్తడంతో జోగయ్య పంటపై పూర్తి నమ్మకం కలిగింది. సైకిల్ దంతెను మనుషులతో లాగించి కలుపు తీయించి మందును పిచికారీ చేశాడు. సకాలంలో పంటకు నీళ్లు అందించడంతో ఇప్పుడు మిరప కాయలు విరగకాస్తున్నాయి. ప్రస్తుతం పంట కాయలు కాయడంతో జోగయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
మిర్చి లాభాదాయక సాగు
పచ్చి మిర్చి సాగు చాలా లాభసాటి వ్యవసాయమని నర్సాపూర్ ఏవో వెంకటేశ్ తెలిపారు. నారు నాటు వేసిన 60 రోజుల్లో పంట చేతికి వస్తుందని, వారం నుంచి 15 రోజులకు ఒక సారి పంటకు నీరు అందిస్తే చాలన్నారు. అన్ని నేలల్లో ఈ పంట పండుతుందని, ముఖ్యంగా నల్లరేగడి, శెలక నేలల్లో ఈ పంట ఆరోగ్యంగా పండుతుందన్నారు. ఎకరానికి 50 నుంచి 60 వేల పెట్టుబడి అయితే, 200 క్వింటళ్ల దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం క్వింటాలుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా రైతు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. పచ్చి మిర్చి విక్రయించడం కూడా పెద్ద ఇబ్బంది ఏమీ కాదన్నారు. స్థానిక మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించుకోవచ్చన్నారు. మిరప పంట 7 నుంచి 8 సార్లు కాయను తెంపుకోడానికి వీలుపడుతుందన్నారు. జీడిమెట్ల నర్సరీలో ముందుగా బుక్ చేసుకుంటే రైతులకు మిర్చి నారుని హార్టికల్చర్ వారు అందిస్తారన్నారు. మిర్చి పంటకు సకాలంలో మం దులు, నీటిని అందిస్తే నష్టమనేదే వాటిల్లదన్నారు. ఇది పూర్తిగా లాభసాటి పంట అని సూచించారు.