సిద్దిపేట అర్బన్/మెదక్/సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో పేర్లను పరిశీలించి, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ సవరణ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని గరుడయాప్ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, ఇతర అధికారులు హాజరయ్యారు. మెదక్ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయిరాం, ఎలక్షన్ సూపరిం టెండెంట్ శైలేంద్ర పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు మేడ్చల్ జిల్లా నుంచి పాల్గొనగా, సంగారెడ్డి జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారందరినీ ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో మృతి చెందిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుంచి ఫారం-7 ద్వారా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలిగించాలన్నారు. డబుల్ ఓటర్లను గుర్తించి తొలిగించాలని చెప్పారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈవీఎం గోదాములను ప్రతి నెల తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి బీఎల్ఎం గరుడ ఉపయోగిస్తున్నామని, జనవరి 5న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.