ఉపాధి హామీ నిధులతో పనులు
రూ.146.67 కోట్లతో మట్టి రోడ్ల నిర్మాణం
పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేస్తే ఏర్పాటు
సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు
యాదాద్రి భువనగిరి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :వ్యవసాయ పొలాలకు సరైన దారులు లేక రైతాంగం ఇబ్బందులు పడుతున్నది. విత్తనాలు, ఎరువులు తీసుకెళ్లేందుకు పండించిన ధాన్యాన్ని మార్కెట్లకు తరలించేందుకు అవరోధాలు కల్గుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలం బాటకు ఉపాధి హామీ పథకం బాసటగా నిలుస్తున్నది. ఏండ్ల తరబడిగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నది. జిల్లాలో 2020-21 సంవత్సరానికి రూ.73.65 కోట్లతో 118 రోడ్లు, 2021-22 సంవత్సరానికి రూ.73.02 కోట్లతో 117 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. ఇప్పటికే చాలా చోట్ల పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. రైతుల విజ్ఞప్తుల మేరకు మిగిలిన పనులను సైతం చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
జిల్లాలో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సేద్యం పండుగలా సాగుతోంది. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో సుమారు 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అయితే వారు పొలాలకు వెళ్లేందుకు సరైన దారులు లేక ఏళ్లతరబడి ఇబ్బందులు పడుతున్నారు.
దారి సరిగా లేక అవస్థలు
ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, ఎత్తైన గుట్టలున్న ప్రాంతాల్లో ఉన్న భూముల్లో వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. వ్యవసాయ సీజన్లో విత్తనాలు, ఎరువులను ట్రాక్టర్లలో, ఎడ్లబండ్లపై తరలించేందుకు మరింతగా అవస్థలు పడాల్సి వస్తోంది. వర్షాకాలంలో వారి ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో మట్టి రోడ్లను ఏర్పాటు చేస్తున్నది.
దరఖాస్తు చేసుకుంటే మంజూరు
రోడ్లు అవసరమైన రైతులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతి రాగానే మంజూరు చేస్తారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న మట్టిరోడ్లతో ఏండ్లనాటి సమస్యకు పరిష్కారం దొరుకడంతోపాటు కూలీలకు ఉపాధి లభిస్తున్నది. చాలామంది రైతులకు దీనిపై అవగాహన లేక దరఖాస్తు చేసుకోవడం లేదు. ఫలితంగా అందుబాటులో నిధులు ఉన్నప్పటికీ పొలం బాటలకు మోక్షం కలుగడం లేదు.
రూ.146.67కోట్లతో పనులు
జిల్లాలో 2020-21 సంవత్సరానికి 118 పనులను చేపట్టేందుకు రూ.73.65కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించింది. ఇప్పటివరకు రూ.12.73 లక్షలతో చేపట్టిన 26 ఫార్మేషన్ రోడ్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా 92 రోడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో పాటు 2021-22 సంవత్సరానికి గాను 117 రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు రూ.73.02 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు. ఇప్పటివరకు రూ.1.75 లక్షల వ్యయంతో 7 పనులు పూర్తయ్యాయి. ఇంకా 110 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఉపాధిహామీలో ప్రభుత్వం మట్టి రోడ్లకు భారీగా నిధులు కేటాయించినప్పటికీ పనుల్లో జాప్యం నెలకొంటుండడంతో వాటిని వేగవంతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పొలాలకు వెళ్లే రైతుల ఇబ్బందులను తీర్చేందుకు అవసరమైన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధిహామీ నిధు లు మంజూరు చేస్తున్నది. రైతు లు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలి. రోడ్డు అవసరమైన రైతులు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. వివాదాలు లేని భూముల్లో మట్టిరోడ్డు నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం.