ఆంజనేయస్వామికి ఆకుపూజ
వైభవంగా కార్తికమాస పూజలు
యాదాద్రి, నవంబర్ 30 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో మంగళవారం లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో స్వామి, అమ్మవార్లను సహస్ర నామ పఠనాలతో పూజించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. దేవస్థాన ఉప ప్రధానార్చకుడు, వేద పండితులు, అర్చకబృందం, పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి ఆకుపూజ శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణుపుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు. వేదమంత్ర పఠనాలతో ఆంజనేయ స్వామిని సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించి తమలపాకులతో అర్చించారు. ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితాపారాయణం చేసి, ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.
హుండీల ఆదాయం రూ.1,25,56,990
యాదాద్రి నారసింహుడి 20రోజుల హుండీల ఆదాయం కోటి దాటిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రి కొండపై గల హరిత హోటల్లో మంగళవారం హుండీలను లెక్కించగా రూ.1,25,56,990 ఆదాయం వచ్చిందని తెలిపారు. మిశ్రమ బంగారం 133గ్రాములు, మిశ్రమ వెండి నాలుగు కిలోల 450గ్రాములు వచ్చిందని తెలిపారు.