పెండింగ్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
సిద్దిపేట కలెక్టర్ హనుమంతరావు
సిద్దిపేట అర్బన్, నవంబర్ 30 : గౌరవెళ్లి రిజర్వాయర్ పెం డింగ్ భూ సేకరణ పూర్తి చేసి, పనులు వేగవంతం చేయాలని సిద్దిపేట కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో గౌరవెళ్లి రిజర్వాయర్ పెండింగ్ భూ సేకరణ, పనుల పురోగతిపై రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ భూ సేకరణ వివరాలు, అందుకు గల కారణాలను అక్కన్నపేట తహసీల్దార్ వేణుగోపాల్ కలెక్టర్కు వివరించారు. ప్రాజెక్టు భూ సేకరణ 3870 ఎకరాలకు గానూ, 272 ఎకరాల భూసేకరణ మాత్రమే పెండింగ్లో ఉందని, ఇందులో 19 ఎకరాల భూసేకరణ ఇటీవల పూర్తయిందని, మిగతా భూసేకరణకు సంబంధించి పరిహారం చెక్కులు సిద్ధంగా ఉన్నాయని తహసీల్దార్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్వాసితులకు చట్టం ప్రకారం ఆర్అండ్ఆర్ ప్రయోజనాలను అందించాలన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నందున పరిహారం చెక్కులను తీసుకొని వెంటనే ముంపు ప్రాంతాలను ఖాళీ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఉప్పరపల్లి భూసేకరణపై దౌల్తాబాద్ తహసీల్దార్తో మాట్లాడారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఎన్సీ శంకర్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీర్ రాములు, ఉప కార్య నిర్వాహక ఇంజినీర్లులు కరుణ, ప్రశాంత్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీ, పేమెంట్లలో వేగం పెంచాలని సిద్దిపేట కలెక్టర్ పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ట్యాబ్ ఎంట్రీ, డబ్బులు చెల్లింపులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లా ధాన్యం .
కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీ, పేమెంట్లలో వెనుకబడి ఉందని.. మరింత వేగం పెంచాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కేంద్రాల ఇన్చార్జిలు, మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ నిత్యం పర్యవేక్షించాలన్నారు. సిద్దిపేట జిల్లాలో డిసెంబర్ నెలాఖరు నాటికి వంద శాతం ధాన్యం కొనుగోలు పూర్తవుతుందని అధికారులు వివరించారు.
డిసెంబర్ 14 నుంచి వరుస గృహ ప్రవేశాలు
డిసెంబర్ 14 నుంచి సిద్దిపేట జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని సిద్దిపేట కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గ్రామా లు, పట్టణాల వారీగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను ప్రారంభోత్సవాలకు సన్నద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గజ్వేల్ పట్టణంలో 1250, దుబ్బాక పట్టణంలో 852, దుబ్బాక రూరల్లో 400, దౌల్తాబాద్ మండలంలో 170, రాయపోల్ మండలంలో 185, తొగుట మండలంలో 80, బెజ్జంకి మండలంలో 98, హుస్నాబాద్లో 160 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయని అధికారులకు కలెక్టర్కు తెలిపారు. క్షేత్రస్థాయి విచారణ అనంతరం పారదర్శకంగా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని అధికారులు కలెక్టర్కు వివరించారు.
సంపూర్ణ వ్యాక్సినేషన్ జిల్లాగామారేందుకు కృషి చేయాలి
సిద్దిపేట జిల్లాలో 18 ఏండ్లు నిండి మొదటి, రెండో డోస్ తీసుకోని వారు ఉండద్దని కలెక్టర్ వైద్య అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనలు రేకెత్తిస్తున్నందున జిల్లాలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, ఉప వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒమిక్రాన్ వస్తే ఎదురయ్యే అనర్థాలను ప్రజలకు వివరించి టార్గెట్ ఓరియంటెడ్గా వ్యాక్సినేషన్ను మిషన్ మోడ్లో చేపట్టాలన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యం సాధించేందుకు ఈ వారాన్ని వ్యాక్సినేషన్ వీక్గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ నుంచి కళాశాల విద్యార్థుల వరకు నేత్ర సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ముందుకు వచ్చిందని కలెక్టర్ అన్నారు. విద్యార్థుల నేత్ర సంబంధిత, దృష్టి లోపాలను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చే సోమవారం నుంచి ప్రాథమిక స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.