మహబూబాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మానుకోట జిల్లాలో ఏటా పుచ్చకాయల సాగు పెరుగుతున్నది. సీజన్కు ముందే జిల్లా ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో రైతులు సాగువైపు మొగ్గుతున్నారు. 2016-17లో కేవలం ఐదెకరాల్లోనే సాగవగా, 2017-18లో 15 ఎకరాలు, 2018-19లో 35ఎకరాలు, 2019-20లో 112 ఎకరాలు, 2020-2021లో ఏకంగా 159 ఎకరాల్లో పంట వేశారు. మంచి లాభాలు వస్తుండడంతో రైతులు పుచ్చకాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
ఎకరాకు విత్తనాలు మినహాయిస్తే సుమారు రూ.20వేల పెట్టుబడి అవుతుంది. విత్తనాలు 50గ్రాముల పుచ్చగింజలు రూ.300-రూ.3,600మధ్య ఉన్నాయి. రైతు ఏ రకం విత్తనం కావాలంటే ఆ విత్తనం నాటుకోవచ్చు. 50గ్రాముల ప్యాకెట్ 7గుంటల నుంచి 8గుంటల వరకు వస్తుంది. వాటర్ మిలన్ ఐస్బాక్స్ వెరైటీ మాత్రం 50గ్రాముల ప్యాకెట్కు రూ.3,600 వరకు ఉంది. ఈ విత్తనం ద్వారా వచ్చే పుచ్చకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇవి జిల్లా కేంద్రంలోనే కాకుండా ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. మామూలు రకం పుచ్చకాయలు మార్కెట్లో టన్నుకు రూ.6వేల వరకు ఉండగా, మేలు రకం విత్తనాలతో సాగయిన పుచ్చకాయలకు టన్నుకు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు ధర పలుకుతున్నది. విత్తన రకాన్ని బట్టి 70 రోజుల నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరంలో 20 టన్నుల దాకా దిగుబడి వస్తుంది.
పెట్టుబడి రూ.20వేలు పోను సగటున ఎకరాకు రూ.లక్షదాకా ఆదాయం వస్తుంది. ఏటా ఎండాకాలం ప్రారంభానికి సరిగ్గా మూడు నెలల ముందు డిసెంబర్ చివరి వారం, జనవరి మొదటి వారంలో పుచ్చపంటను రైతులు సాగు చేస్తారు. మార్చి చివరి వారానికి పంట చేతికొస్తుంది. మేలైన విత్తనాలతో సాగయిన పంట టన్నుకు రూ.12వేలు పలుకుతుంది. పుచ్చ సాగుకు పెట్టుబడి తక్కువే అయినా వడగళ్లు పడితే మాత్రం నష్టాలు తప్పవని రైతులు చెబుతున్నారు. పుచ్చలో దోమకాటు ప్రభావం ఎక్కువ ఉంటుంది. దోమకాటుకు గురైతే ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి సంబంధిత మందులు పిచికారీ చేయాలి.