శేరిలింగంపల్లి : అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు.
ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాతయాదవ్ అందించిన రూః 40 లక్షల ఆర్ధిక సహాయంతో నూతనంగా నిర్మించిన హనుమాన్ వ్యాయమశాలను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన కనీస వసతులను కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లపుడు ముందుంటుందని అన్నారు. సుజాతయాదవ్ ఆర్ధిక సహాయం అందించి వ్యాయమశాల నిర్మాణానికి తొడ్పాటునందించడం శుభపరిణామం అని అన్నారు. స్థానిక యువకులకు ఈ వ్యాయమశాల ఎంతగానో తోడ్పడు తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ బాపునగర్లో రాగం దంపతులు ఆర్ధిక సహాయం అందించి స్థానిక యువతకు వ్యాయమశాలను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ది పరుస్తు ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నానని అన్నారు.
శేరిలింగంపల్లి టీఆర్ఎస్ యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.