‘సహజత్వం, వాస్తవికతను ప్రతిబింబించే పాత్రల్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. కమర్షియల్ చిత్రాల్లో నటించినా..అభినయ ప్రధానమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తా’ అని చెప్పింది యువ కథానాయిక వర్ష బొల్లమ్మ. ఈ భామ బెల్లంకొండ గణేష్ సరసన నటించిన తాజా చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ నెల 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ చెప్పిన సినిమా సంగతులివి..
ఈ సినిమాలో నేను భాగ్యలక్ష్మి అనే స్కూల్ టీచర్ పాత్రలో కనిపిస్తా. నా వృత్తికి తగినట్లు కొంచెం పెత్తనం చూపిస్తుంటాను. సితార వంటి పెద్ద సంస్థలో సినిమా అనగానే వెంటనే అంగీకరించా. ఆ తర్వాత కథ విన్నా. బాగా నచ్చింది. చిన్న టౌన్లో కథ నడుస్తుంది. నేనూ అదే నేప థ్యం నుంచి వచ్చాను కాబట్టి పాత్రను త్వరగా అర్థం చేసుకున్నా. స్కూల్, కాలేజీ రోజుల్లో నాకు స్ఫూర్తినిచ్చిన గురువులు ఎంతో మంది ఉన్నారు. వారిని గుర్తు తెచ్చుకొని భాగ్యలక్ష్మి పాత్రలో సహజమైన నటనను ప్రదర్శించాను.
చూడటానికి నేను పక్కింటి అమ్మాయిలా ఉంటాను కాబట్టి ఎక్కువగా మధ్యతరగతి పాత్రలే లభిస్తున్నాయ నుకుంటున్నా. ప్రేక్షకులు కూడా నన్ను అలాంటి పాత్రల్లో చూడటానికే ఇష్టపడుతున్నారు. అయితే క్యారెక్టర్స్ పరంగా ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. ప్రతినాయిక ఛాయలుండే సైకో పాత్ర దొరికినా చేయగలననే నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నా. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల మీదే దృష్టిపెడుతున్నా. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’లోని ‘కొమురం భీముడో..’ పాటలో ఎన్టీఆర్గారి నటన బాగా నచ్చింది. ఆయనకు పెద్ద అభిమానిగా మారిపోయా.