యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ అలంకారంలో భాగంగా నాలుగో రోజు ఆదివారం స్వామివారు ఉదయం వెన్న కృష్ణుడిగా, రాత్రి కాళీయవర్ధనుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు
శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
యాదాద్రి, జనవరి16 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఆదివారం ఉదయం నిత్యారాధనలు, అనంతరం దివ్య ప్రబంధ పారాయణీకులతో స్వామి వారి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ఉదయం వెన్న కృష్ణుడిగా, రాత్రి కాళీయవర్ధనుడిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ వేడుకలు పాంచరాత్ర ఆగమరీత్యా ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చక బృందం దివ్య ప్రబంధ పఠనం చేస్తుండగా బాలాలయంలో అలంకార సేవలు నిర్వహించారు. భక్తులు కనులారా వీక్షించి తరించారు.
వెన్నముద్ద కృష్ణుడిగా..
యాదాద్రి బాలాలయంలో అధ్యయనోత్సవాలు నాలుగో రోజు ఆదివారం వైభవంగా జరిగాయి. ఉదయం వెన్నముద్ద కృష్ణుడిగా యాదాద్రీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వెన్నముద్ద కృష్ణుడిగా అలంకరించి ప్రత్యేక సేవపై అధిష్ఠింపజేసి సేవోత్సవాన్ని నిర్వహించారు. సేవోత్సవంలో దివ్యప్రబంధ పఠనం కొనసాగించారు.
రాత్రి కాళీయవర్ధనుడిగా..
అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రి వేళ లక్ష్మీనరసింహస్వామిని బాలాలయంలో కాళీయవర్ధనుడిగా అలంకరించి ఊరేగించారు. ద్రావిడ ప్రబంధ సేవాకాలంలో పారాయణిక స్వాములతో సేవోత్సవం చేపట్టారు. ఈ వేడుకను అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అలంకార సేవకు హారతిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు గజవెల్లి రమేశ్బాబు, శ్రవణ్కుమార్, పర్యవేక్షకులు ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీరాముడిగా.. వేంకటేశ్వరుడిగా..
పంచనారసింహుడిగా వెలిసిన యాదాద్రి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు శనివారం ఉదయం యాదాద్రీశుడు శ్రీరాముడి అలంకరణ, సాయంత్రం శ్రీ వేంకటేశ్వరస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. నిత్యపూజల అనంతరం నిర్వహించిన ఆధ్యయనోత్సవాల్లో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. సేవల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారికి హారతినిచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఒడి బియ్యం సమర్పణ
స్వామివారి సన్నిధిలో శనివారం గోదాదేవి(ఆండాళ్) అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణతో ధనుర్మాస ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. అధికారులు, మహిళలు ఆండాళ్ అమ్మవారిని కొలుస్తూ ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి దంపతులు గోదాదేవికి ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు స్వామివారి ప్రసాదం అందజేశారు.
నిత్యారాధనలు..
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. బాలాలయంలో దర్శనం అనంతరం రూ.100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకొనే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువైన క్షేత్రపాలక ఆంజనేయస్వామికి జరిగిన పూజల్లోనూ భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ.15,53,852 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,64,150
వీఐపీ దర్శనాలు 1,65,000
వేద ఆశీర్వచనం 1,800
సుప్రభాతం 1,400
ప్రచారశాఖ 18,000
క్యారీ బ్యాగుల విక్రయం 6,600
వ్రత పూజలు 51,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 23,000
ప్రసాద విక్రయం 8,47,420
వాహన పూజలు 23,000
టోల్గేట్ 1,470
అన్నదాన విరాళం 5,982
సువర్ణ పుష్పార్చన 1,28,000
యాదరుషి నిలయం 66,630
పాతగుట్ట నుంచి 41,800
గోపూజ 900