యాదాద్రి, మే12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట దేవాయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు నృసింహస్వామివారి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. నేటి ఉదయం 9.30 గంటలకు స్వస్తీవాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారికి తిరువెంకటపతి అలంకార సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, రుత్విగరణం, హవనం, గరుడ వాహనం, పరవాసుదేవ అలంకార సేవ నిర్వహిస్తారు.
ఆలయ పునర్నిర్మాణం అనంతరం ప్రధానాలయంలో స్వామివారి జయంత్యుత్సవాలను మహా వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఈ సందర్భంగా 13 నుంచి 15 వరకు సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలను స్వామివారి ప్రధానాలయంలో మొదటిసారి నిర్వహించనున్న నేపథ్యంలో వైభవంగా జరిపేందుకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. ప్రధానాలయంలోని ఉత్తర రాజగోపురం పక్కన వెలుపలి ప్రాకార మండపంలో యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలో స్వస్తీవాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్వామివారి అలంకార సేవలను వెలుపలి ప్రాకారంలో గల కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు.
14న ఉదయం 9.00 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయ మర్థన అలంకార సేవ, సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై రామావతారం అలంకారసేవ ఉంటుంది. 15న ఉదయం 7 గంటలకు మూలమస్తృ హవనం, 9 గంటలకు పూర్ణాహుతి, సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు సాగే ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
13వ తేదీన ఉదయం 9.30 గంటలకు స్వస్తీ వాచనం, విశ్వక్సేన పూజ, రక్షా బంధనం, లక్ష పుష్పార్చన, సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. 14న ఉదయం 9.30 గంటలకు విశేష స్నపనం, నిత్య హవనం, నృసింహ మూలమస్త్ర హవనం లక్షపుష్పార్చన, సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం చేపట్టి 15న ఉదయం 9.30 గంటలకు నిత్యహవనం, పూర్ణాహుతి, అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహిస్తారు.