యాదాద్రి, ఏప్రిల్28: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. స్వయంభూ ఆలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, నిత్య తిరు కల్యాణోత్సవం జరిపించారు. సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని, కల్యాణ తంతును తిలకించారు. దేవేరులను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై మాఢవీధుల్లో ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరపాటు కల్యాణ తంతును నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయం నుంచి సా యం త్రం వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం ప్రాకారంలో జరిగిన వెండిమొక్కు జోడు సేవల్లో భక్తులు పాల్గొన్నారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. కొండకింద లక్ష్మీ పుష్కరిణి చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి స్వయం భూ ఆలయంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ. 32,25,078 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో చేపట్టే భద్రతపై గురువారం కొండపైన గల వీవీఐపీ అతిథి గృహంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీసీపీ పీఎస్.రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రింగురోడ్డు చుట్టూ భద్రత, కొండపైకి వచ్చే భక్తులు, బస్సులను పరీక్షించేందుకు స్కానర్ల బిగింపు తదితర ఏర్పాటు పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
స్కాన్ చేసిన అనంతరం భక్తులు కొండపైకి వెళ్లేలా వివిధ దేశాల సాంకేతికత, కెమెరాలు, లైటింగ్, బాంబు డిటెక్టర్లు వినియోగించేలా పునః సమీక్షించారు. ఇప్పటికే కొండపైన 30 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉండగా, మరో 40 మంది వరకు నూతన సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీ భాస్కర్రావు, డీఏస్పీలు వెంకట్రెడ్డి, మదన్మోహన్, సీఐలు సురేశ్, రామకృష్ణ, యాదాద్రి ఈఈ ఊడెపు రామారావు పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బంగారు మంగళసూత్రాలను ఓ దాత విరాళంగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన తడకమల్ల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి కోసం చేయించిన 24.859 గ్రాముల బంగారు మంగళ సూత్రాన్ని గురువారం ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్బాబుకు అందజేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,53,000
వీఐపీ దర్శనం 10,350
రూ.100 టిక్కెట్ దర్శనం 31,200
వేద ఆశీర్వచనం 3,000
నిత్యకైంకర్యాలు 2,400
సుప్రభాతం 6,900
క్యారీబ్యాగుల విక్రయం 13,650
వ్రత పూజలు 1,30,400
కల్యాణకట్ట టిక్కెట్లు 33,600
ప్రసాద విక్రయం 9,39,950
వాహనపూజలు 12,100
శాశ్వత పూజలు 2,500
అన్నదాన విరాళం 21,718
సువర్ణ పుష్పార్చన 1,59,696
యాదరుషి నిలయం 80,620
పాతగుట్ట నుంచి 23,330
లక్ష్మీపుష్కరిణి 600