యాదాద్రి, ఏప్రిల్ 25 : రూ.23.68కోట్ల లాభాలతో డీసీసీబీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని సౌభాగ్య రిసార్ట్స్లో సోమవారం నిర్వహించిన డీసీసీబీ పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మే మాసంలో ‘సహకార వృద్ధి’ పథకంతో డిపాజిట్ల సేకరణ మాసోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే రూ.514కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు.
103ఏండ్ల డీసీసీబీ చరిత్రలో రూ.900 కోట్ల టర్నోవర్ ఉండగా తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టాక రూ.1,750కోట్ల టర్నోవర్తో దూసుకుపోతున్నదన్నారు. ఏ బ్యాంకుకు లేని ఎన్పీఏ శాతం నల్లగొండ సహకార బ్యాంకుకు వచ్చిందన్నారు. గతంలో 13శాతం ఉన్న ఎన్పీఏ తాజాగా 2.32శాతానికి తగ్గిందన్నారు. ఇందులో పాలకవర్గం, ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. ఉద్యోగులకు లక్ష బీమా ఉండగా వాటిని రూ.5లక్షలకు మార్చి ఆదుకుంటున్నామని తెలిపారు.
పారదర్శకంగా 70మంది ఉద్యోగులను బదిలీ చేశామన్నారు. వానకాలం సీజన్లో స్వల్పకాలిక రుణాలకు రూ.100కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే దీర్ఘకాలిక రుణాలు రూ. 200కోట్లు మంజూరు చేశామని, 8.3శాతం వడ్డీతో ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతు పిల్లల విదేశీ చదువులకు ఒక్కొక్కరికి రూ.25లక్షల రుణాలు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 700మంది రైతుల పిల్లలకు రుణాలు అందించామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, డైరెక్టర్లు ప్రవీణ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సైదయ్య, సైదులు, అప్పిరెడ్డి, అంజయ్య, రంగాచారి, జయరాంనాయక్, సంపత్రెడ్డి, సీఈఓ మదన్మోహన్, డీజీఎం ఉపేందర్, ఏజీఎం ప్రవీణ్ పాల్గొన్నారు.