ఆ గ్రామంలో ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా కనిపించదు. ఎవరూ బహిరంగంగా మందు తాగరు. కాదని ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే అక్షరాల పది వేల రూపాయలు గ్రామపంచాయతీకి జరిమానా కట్టాల్సిందే! పాతికేండ్ల కింద ఊరి పెద్దలు చేసిన ఈ తీర్మానం నేటికీ నిక్కచ్చిగా అమలవుతున్నది. యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఊరుమ్మడి నిర్ణయం అక్కడి మర్రిగూడ మండలంలోని కమ్మగూడెంలో మద్యపానాన్ని నియంత్రిస్తున్నది.
కమ్మగూడెంలో 280 కుటుంబాలు, జనాభా 1200 మంది. ఇందులో ఎస్సీ, బీసీ, జనరల్ సామాజిక వర్గాల వారున్నారు. ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి పత్తి సాగు చేస్తున్నారు. విద్యావంతులు హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. 20 మందికి పైగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.
గ్రామ యువత పెడదారి పట్టకుండా ఉండేందుకే మద్యపానాన్ని నిషేధించేందుకు తీర్మానం చేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. చదువుకునే వయస్సులో తాగుడు వైపు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా తాగుతుంటే యువకుల ఆలోచన మారొచ్చని భావించారు. అందుకే బహిరంగంగానూ మద్యం సేవించవద్దని నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
గ్రామంలో గతంలో 4 బెల్టు షాపులు ఉండేవి. వీటికి తోడు పక్క గ్రామాల నుంచి కూడా మద్యం తెచ్చుకొని స్థానికులు గ్రామంలోని వీధుల్లో, పరిసరాల్లో మద్యం సేవించేవారు. ఈ క్రమంలో తీర్మానం తర్వాత మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. విక్రయించిన వారికి రూ.10వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.5వేల నజరానా ప్రకటించారు. రహస్యంగా మద్యం విక్రయించిన దుకాణాలపై గ్రామస్తులు పలుమార్లు దాడులు చేసి వ్యాపారస్తులకు ఫైన్ వేసిన సందర్భాలున్నాయి.
పండుగలు, వివాహాలు, శుభకార్యాలకు అతిథులు వచ్చిన సమయాల్లో ఇంట్లోనే విందులు, వినోదాలు జరుపుకొంటారు. అతిథులకు మర్యాద చేయడానికి మద్యాన్ని బయటి నుంచి తెచ్చుకొని ఇంట్లోనే దావత్ ఏర్పాటు చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో తాగేందుకు గ్రామస్తులు ఎవ్వరూ కూడా ఆసక్తి చూపరు. పండుగలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు మద్యం విక్రయించడానికి సాహసించరని స్థానికులు పేర్కొంటున్నారు.
యువత చెడిపోవద్దని మద్యం నిషేధించినం. కొంత మంది మద్యానికి అలవాటు పడి టెన్త్, ఇంటర్లోనే చదువు మానేస్తున్నారు. అందుకే పెద్దలందరం నిర్ణయించుకొని పిల్లలను మద్యం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలనుకున్నాం. ఊర్లో ఎవ్వరూ కూడా బెల్టు షాపులు పెట్టొద్దని తీర్మానం చేసినం. పెద్దల నిర్ణయాన్ని కాదని మద్యాన్ని అమ్మినవారికి రూ.10వేల ఫైన్ వేసి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చినం.
– మార్నేని అమృతయ్య, గ్రామస్తుడు
గ్రామంలోని ఎవ్వరైనా సరే.. బహిరంగంగా తాగడం తప్పే. పండుగలు, పెండ్లిళ్లు, ఫంక్షన్ల టైమ్లో మద్యాన్ని బయటి గ్రామాల్లో కొనుక్కొని తెచ్చుకుంటరు. పండుగల సమయాల్లో బంధువులు, మిత్రులకు ఇండ్లల్లోనే విందు ఏర్పాటు చేస్తారు. మద్యపానం నిషేధించడం వల్ల గ్రామంలో గొడవలు తగ్గినయి. బెల్టు షాపులను తొలగించేందుకు చాలా రిస్క్ తీసుకున్నం. మద్యపాన నిషేదానికి ప్రజలంతా సహకరిస్తున్నరు.
– మార్నేని దామియాన్, గ్రామస్తుడు