
వైభవంగా క్షత్రీయ రాజపుత్రుల కల్యాణం
వారసత్వ ఆచారం కొనసాగిస్తున్న రాజపుత్రులు
ఆర్థిక ఇబ్బందులున్నా సంప్రదాయనికి పెద్దపీట
కనువిందు చేస్తున్న క్షత్రీయ రాజపుత్రుల పెండ్లి తంతు
రాజాపేట, ఆగస్టు 28 : క్షత్రియ రాజపుత్రులు, రాజా మహారాణాప్రతాప్ వారసులు. రాజ్యాధికారులు, ప్రభువులు వారు తలచుకుంటే కానిది ఏమి ఉండదు. మంది మారుబలం, హంగూఆర్భాటం చెప్పనలవికావు. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాలు పోయి రాజరికపు పాలన అంతరించగా, కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో అంతరాలు ఏర్పడ్డాయి. అయినా క్షత్రియ రాజపుత్రులు తమ వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాలు, వ్యవహారాలు కొనసాగిస్తూ తమ వారసత్వ సంప్రదాయాన్ని కాపాడుకుంటున్నారు. పెండ్లి తంతును ఇప్పటికీ విభిన్నంగా కొసాగిస్తూ భవిష్యత్తు తరాలకు అందిస్తున్నారు.
బుందేల్ఖండ్ నుంచి ఈ ప్రాంతానికి…
క్షత్రియ రాజపుత్రులు 200 సంవత్సరాల క్రితం బ్రిటీష్ పాలనలో ఉద్యోగ రీత్య రాజపుత్ర మిలిటరీ బెటాలియన్ ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ నుంచి భువనగిరి డివిజన్లోని పలు ప్రాంతాలకు వచ్చారు. రాజాపేట, జాల, కొండమడుగు, చీమలకొండూరుతోపాటు వీరవెల్లి గ్రామాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్య్రం అనంతరం కొంత మంది వెళ్లిపోగా, మరికొందరు ఈ ప్రాంతంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నిజాం కాలంలో ఈ ప్రాంతంలో రజాకార్లు చేసిన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేశారు. ప్రజల మానప్రాణాలు కాపాడుతూ రజాకార్ల ముష్కర చేతుల్లో ఎందరో బలి అయ్యారు. రాజ వంశీయులుగా పిలువబడే క్షత్రియ రాజపుత్రులు ఆయా గ్రామాల్లో పటేల్, పట్వారీలుగా తమ గ్రామ ప్రజలతో మమైకమై వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో బతుకు దెరువుకోసం హైదరాబాద్కు వలస వెళ్లారు.
కొనసాగిస్తున్న ఆచార కట్టుబాట్లు..
దేశంలో నేడు కంప్యూటర్ యుగం పయనిస్తున్న తరుణంలో హిందూ వివాహాల్లో సంస్కృతి సంప్రదాయం కనుమరుగవుతున్నాయి. క్షత్రియ రాజపుత్రులు మాత్రం వారసత్వ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా వివాహాల్లో ఇప్పటి వరకు పురాతన కాలం నాటి ఆచారాలు కొనసాగిస్తున్నారు.
ధూంధాంగా బరాత్..
క్షత్రియ రాజపుత్రుల కులస్తులు పెండ్లికి ముందే బరాత్ తీస్తారు. పూర్వీకుల ఆచారం ప్రకారం బరాత్కు గుర్రాన్ని వాడుతారు. సుమారు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు పెట్టి తెప్పించి గుర్రాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతారు. రాజ కిరీటంలా తయారు చేసిన బాసింగాన్ని పెండ్లి కుమారుడు ధరించి తల్వార్ చేత పట్టుకొని గుర్రంపై రాజులా దర్జాగా కూర్చుంటాడు. గ్రామంలోని వీధుల్లో బాజాబజంత్రీలతో సాగే బరాత్లో చిన్నాపెద్ద, ఆడమగ తేడాలేకుండా నృత్యాలు చేస్తూ ధూంధాంగా కొనసాగిస్తారు. వివాహ వేడుకలో బరాత్కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. బరాత్ చూడడానికి బంధువులు, జనం ఎగబడుతారు.
సంప్రదాయబద్ధంగా పెండ్లి..
పెండ్లి పందిరిలో నూతన వధూవరులకు ఒకరినొకరు పూలమాలలు వేసుకోగా, పది మంది పెద్దలు అక్షింతలు వేసి ముందే ఆశీర్వదిస్తారు. ప్రత్యేక వేద పండితులచే హిందీ బాష మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయ బద్ధంగా వివాహం వైభవంగా కొనసాగుతుంది. నూతన వధూవరులు కొంగు ముడి వేసుకొని ఏడడుగులు నడిచి మూడుముళ్ల బంధంతో ఒక్కటై తలంబ్రాలు చల్లుకుంటారు. పలు రకాల మిఠాయిలు, శాఖాహారం భోజన విందుతో పెండ్లి తంతు ముగిసి నూతన వధూవరులను సాగనప్పుతారు.
రాజ కిరీటంలా బాసింగం..
పెండ్లి సందర్భంగా వధూవరులు ధరించే బాసింగం రాజకిరీటంలా తయారు చేస్తారు. హైదరాబాద్లోని పాతబస్తీ, కరీంనగర్ జిల్లాలో మాత్రమే బాసింగం తయారీకి ప్రత్యేక నిపుణులుంటారు. బాసింగం ఈత ఆకులతో తయారు చేసి రంగుల పూలతో అందంగా తీర్చిదిద్దుతారు. వివాహానికి పదిరోజుల ముందే బాసింగం అల్లడానికి ఆర్డర్ ఇస్తే..పెండ్లి రోజు వరకు పూర్తి చేసుకొని బుట్టలో జాగ్రత్తగా తీసుకొస్తారు. సుమారు రూ.15వేల వరకు ఖర్చు వస్తుంది.
పెండ్లికి ముందే గొడవ..
ఎదురుకోళ్లలో నూతన వధూవరుల ఇరువురి బంధువులు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తారు. సంప్రదాయంగా బొట్టు పెట్టి పూలమాల వేసి శాలువాలతో ఒక్కరినొకరు సత్కరించుకుం టారు. అనంతరం బంధుత్వంలో ఇక ముందు ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా నూతన వధూవరులతోపాటు ఇరువురి బంధువులు పెండ్లికి ముందే గొడవ పడి సంప్రదాయంగా బియ్యంతో కొట్టుకుంటారు. వేదపండితుల గాయత్రి మంత్రోచ్చరణలతో వరుడికి ఐదుగురు కలిసి జంజనిధారణ గావిస్తారు. అనంతరం పెండ్లి పందిరిలోకి సాదరంగా ఆహ్వానిస్తారు.
చెప్పలేనంత వైభవంగా పెండ్లి..
తన వివాహం పూర్వీకుల ఆచారం ప్రకారం జరిగింది. క్షత్రీయ రాజపుత్రుల కులస్తుల్లో ఆర్థిక ఇబ్బందులున్న నాటి నుంచి నేటి వరకు పెండ్లిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. పూర్వీకుల ఆచారం, సంప్రదాయ ప్రకారం జరిగే పెండ్లిని చూస్తే తప్పా చెప్పలేనంత వైభవం కొనసాగుతూనే ఉన్నాయి. బంధువుల్లో ఎక్కడ పెండ్లి జరిగినా వెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగే వివాహాన్ని ఎంతో ఆనందంగా తిలకిస్తాం.