రామగిరి, నవంబర్ 18 : విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనంతో పాటు మరొక ప్రోత్సాహకం ప్రకటించింది. గ్రామాల నుంచి పాఠశాలలకు బస్ సౌకర్యం లేని విద్యార్థులకు రవాణా ఛార్జీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1.80కోట్లు విడుదల చేసింది. దాంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 487 పాఠశాలల్లో 3,102మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. త్వరలో నేరుగా విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లోకి ఈ చార్జీల నిధులు జమకానున్నాయి. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు వేర్వేరుగా ఈ నిధులు అందిస్తున్నారు. 9,10వ తరగతి విద్యార్థులకు సైతం ఛార్జీలు అందించనున్నారు.
అమలు ఇలా…
పేద విద్యార్థులను విద్యలో ప్రోత్సహించేందుకు ప్రభు త్వం రవాణా భత్యం అమలు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలలు (1 నుంచి 5వ తరగతి), ప్రాథమికోన్నత, జడ్పీ పాఠశాలల్లో (1 నుంచి 8వ తరగతి) చదివే విద్యార్థులకు దీన్ని అమలు చేస్తున్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థికి రూ.600 చొప్పున అందిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా 3,102 మంది విద్యార్థులకు లబ్ధి కలిగింది.
విద్యాహక్కు చట్టం అమలులో భాగంగానే…
విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలో మీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాలకు 3కి.మీ, ఉన్నత పాఠశాలలకు 5కి.మీ దూరం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా చార్జీలు(భత్యం) పథకం వర్తిస్తుంది. ఒక్కో విద్యార్థికి నెలలకు రూ.600 చొప్పున 10నెలలకు గాను రూ.6వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే ప్రస్తుత కరోనా నేపద్యంలో ఐదు నెలల రవాణా భత్యాన్ని మాత్రమే మంజూరు చేశారు. జిల్లావ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున 5నెలలకు గాను రూ. 3వేలు అందనున్నట్లు తెలుస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో నిధుల విడుదల ఇలా…
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2021-22 విద్యా సంవత్సరంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోని అర్హులైన విద్యార్థులకు రవాణా ఛార్జీలు ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,102 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు విద్యాశాఖాధికారులు గుర్తించారు.
నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం
ప్రతి విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రవాణా ఛార్జీలు(భత్యం) అందిస్తున్నది. ఈ విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. ఆయా పాఠశాలల్లోని అర్హులైన విద్యార్థుల జాబితాలను అందించాలని ఎంఈఓలను కోరాం. దీంతో నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వచ్చిన నిధులు అర్హులకందేలా చూస్తాం.
-బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ