యాదాద్రి, ఫిబ్రవరి 1 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో నిత్యోత్సవాలు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామివారి బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఆలయ మహామండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు. వేదమంత్ర పఠనాలతో ఆంజనేయ స్వామికి సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించారు. తమలపాకులతో అర్చించి, వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితా పారాయణము చేసి, ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. శ్రీవారి ఖజానాకు మంగళవారం రూ. 6,50,074 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.