భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం, జనవరి 20: కొవిడ్ నియంత్రణకు సిద్ధంగా ఉన్నామని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఒకవేళ కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు, వైద్యం అందించేందుకు అన్ని సౌకర్యాలనూ అందుబాటులో ఉంచామని అన్నారు. కొవిడ్ నియంత్రణకు ఇంటింటి సర్వే నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎస్ సోమేశ్కుమార్ కలిసి జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సీజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జిల్లాలో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణకు 1.15 లక్షల రాపిడ్ కిట్లు, 58 వేల హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. మణుగూరు ఆస్పత్రిని ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రక్రియను 105 శాతం పూర్తి చేశామని, రెండో డోస్ను 82 శాతం, టీనేజర్లకు 57 శాతం పూర్తి చేసినట్లు వివరించారు. అన్ని వ్యాక్సిన్ల ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేస్తామని సమాధానమిచ్చారు. కొవిడ్తో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను రెండు రోజుల్లో పోర్టల్లో అప్లోడ్ చేస్తామని అన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ శిరీష, డాక్టర్ పోటు వినోద్, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఇదే వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం జిల్లా నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ రాహుల్, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, జిల్లా సర్వేలైన్స్ అధికారి డాక్టర్ రాజేశ్ , జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.