గోదావరి జలాలతో నిండిన లింగాలఘనపురం చెరువు
కేవలం జాలునీటితో 40 ఎకరాలు సాగులోకి
స్థానిక రైతుల్లో ఆనందం
లింగాలఘనపురం, ఏప్రిల్ 8 : చెరువు ఊరికి ఆదరువు. చెరువు నిండా నీళ్లుంటే ఆ ఊరు సిరిసంపదలతో తులతూగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని కులాలవారికి బతుకుదెరువునిస్తుంది. అలాంటి చెరువు ఉమ్మడి పాలనలో పట్టింపు లేక వట్టిపోయింది. పూడిక నిండి, నీళ్లు వచ్చే వసతి లేక ఎండిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. చివరికి వినాయక నిమజ్జనానికి సైతం చుక్క నీరు లేక వెక్కిరించింది. ఇక పంటలపై స్థానిక రైతుల్లో ఆశలు చచ్చిపోయాయి. ఎట్టకేలకు 30ఏళ్ల తర్వాత స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు పుణ్యమా అని లింగాలఘనపురం పాత చెరువు గోదావరి జలాలతో నిండింది. వేల కిలోమీటర్ల దూరం నుంచి వాగులు.. వంకలు దాటుకొని వచ్చిన నదీమాతల్లి నీటితో నిండి అలుగు పోసింది. ఏళ్లుగా పడావుపడిన బీడు భూములకు ప్రాణం పోసింది. కేవలం చెరువు నుంచి వచ్చే జాలునీటితోనే దాదాపు 40 ఎకరాలు సాగులోకి వచ్చి ఈ ప్రాంతమంతా పచ్చదనాన్ని పులుముకుంది.
ఎగువ ప్రాంతమైన లింగాలఘనపురం వరుసగా 30 ఏళ్ల నుంచి తీవ్ర కరువును ఎదుర్కొంది. ఇక్కడి పాత చెరువులో ఒకప్పుడు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా నీళ్లుండకపోయేవి. చెరువుపై ఆధారపడిన ఎంతోమంది చేతినిండా పనిలేక పట్టణాలకు వలస వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల యజ్ఞంలో భాగంగా వేల కిలోమీటర్ల దూరం నుంచి పరుగులు పెడుతూ వచ్చిన గోదావరి జలాలు లింగాలఘనపురం చెరువును నింపాయి.
చీటకోడూరు రిజర్వాయర్, స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి రైతులు చాలా శ్రమకోర్చి గోదావరి జలాలను చెరువులోకి తరలించుకున్నారు. ప్రధాన కాల్వ 800 మీటర్ల మేర అసంపూర్తిగా ఉన్నా, రైతులందరూ పార్టీలకతీతంగా ఏకమై ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో బాగుచేసుకొని గోదావరి జలాలను లింగాలఘనపురం పాతచెరువులోకి తరలించుకున్నారు. వరుసగా 30 ఏళ్ల నుంచి చుక్కనీటికి నోచుకోని చెరువు గోదావరి జలాలతో నిండి 15 రోజులు మత్తడి దుంకింది. చెరువు కట్ట కింద వచ్చే జాలు (ఊటనీరు) నీటితో 25 మంది రైతులు 40ఎకరాల్లో వరి సాగు చేశారు. కొందరు రైతులు పండిన వరి ధాన్యాన్ని ఇళ్లకు తీసుకెళ్తుండగా, మరికొందరి వరి పంట కోత దశలో ఉంది.
ఇవి కూడా చదవండి..
ముకేశ్పై ఫైన్కు వ్యతిరేకంగా శాట్కు రిలయన్స్!
మాస్క్ మస్ట్.. అనుక్షణం అప్రమత్తతతో మెలగాలి: సీఎం కేసీఆర్