సర్కారీ కొలువు సాధించాలనే పట్టుదల మెండుగా ఉన్నా కోచింగ్ తీసుకోలేని పేద యువతకు పలు శిక్షణ కేంద్రాలు కొండంత భరోసానిస్తున్నాయి. వేలాది ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కారు సిద్ధమైన నేపథ్యంలో పేద ఉద్యోగార్థులకు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ముందుకొచ్చారు. ఈమేరకు నర్సంపేటలోని విన్నర్స్ అకాడమీ అధ్యాపకులు, నిపుణులతో నిరుద్యోగులకు మెళకువలు నేర్పిస్తున్నారు. ఈ ఫ్రీ కోచింగ్ కోసం మొత్తం 1200 మంది దరఖాస్తు చేసుకోగా, నర్సంపేట సెగ్మెంట్లోని ఆరు మండలాలతోపాటు మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల 900 మంది యువతీయువకులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
నర్సంపేట, మే 8 : నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సొంత ఖర్చులతో ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఉచితంగా కోచింగ్ ఇప్పించారు. అప్పుడు 6వేల మంది ఈ ఉచిత కోచింగ్ తీసుకోగా, 270మంది పోలీసు, బ్యాంకింగ్, ఇతర రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ప్రకటించిన తరుణంలో పేదింటి యువత లక్షల్లో ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి వారికి ఎమ్మెల్యే పెద్ది మరోసారి ఫ్రీ కోచింగ్ పెట్టి వారి ఉద్యోగ కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం నర్సంపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ట్రైనింగ్ ప్రారంభించగా, నర్సంపేటతోపాటు మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వస్తున్నారు.
ప్రతి రోజూ ఉదయం 9గంటలకు ఈ కోచింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతోంది. ఉద్యోగార్థులు ఆటోలు, ఆర్టీసీ బస్సులు, మహబూబాబాద్ ప్రాంతంలోని వారు రైలులో ఇక్కడి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. అధ్యాపకులు ఆయా సబ్జెక్టులపై మెళకువలు నేర్పిస్తున్నారు. మధ్యమధ్యలో ప్రశ్నలు వేస్తూ అవసరమైన నోట్స్ కూడా అందిస్తున్నారు. స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నారు. ఇలా అన్ని రకాల సిలబస్ను రెండు నెలల్లో పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణ పూర్తిచేశారు. మే 1 నుంచి జూన్ 30 వరకు ఈ ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించనున్నారు. ఇందులో అన్ని రకాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విధంగా అభ్యర్థులకు తగు తర్ఫీదునిస్తున్నారు. టెట్, ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్, ఇతర ఉద్యోగాలకు అవసరమైన విషయాలను ఇందులో బోధిస్తున్నారు.
ఉచిత కోచింగ్ సెంటర్లో విన్నర్స్ అకాడమీ అధ్యాపకులు చాలా మంచిగా చెబుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో వచ్చాను. నాకు ప్రైవేట్ కోచింగ్ తీసుకునే స్థోమత లేదు. ప్రైవేట్లో చెప్పే ఫ్యాకల్టీతో నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఫ్రీగా కోచింగ్ ఇప్పించడం మా అదృష్టం. దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. రోజూ మా ఊరు నుంచి ఆటోలో వచ్చి ఉచిత కోచింగ్ సెంటర్లోనే చదువుకుంటున్న. నాతో పాటు మా స్నేహితులందరు ఇక్కడే చదువుతున్నారు.
– సుకన్య, అశోక్నగర్
పోలీసు శాఖలో ఉద్యోగాల ప్రకటనతో రోజూ గ్రౌండ్లోకి వెళ్లి పలు రకాల ఈవెంట్లు ప్రాక్టీసు చేస్తున్నాం. అథ్లెటిక్లలో పాల్గొని రోజూ ప్రాక్టీసు చేసి మెరుగుపడుతున్నాం. దీనికి అవసరమైన విధంగా కోచ్లతో మెళకువలను తెలుసుకుంటున్నాం. వేకువజామునే నిద్ర లేచి గ్రౌండ్కు వెళ్తున్నాం. అలాగే ఉచిత కోచింగ్ సెంటర్కు వెళ్తున్నాం. విన్నర్స్ అకాడమీ అధ్యాపకులు అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. ఉచిత కోచింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తన సొంత ఖర్చుతో తరగతులు నిర్వహించడం చాలా సంతోషం. కోచింగ్ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగం తప్పక సాధిస్తాం.
– సుమన్, నర్సంపేట
ఉచిత కోచింగ్ సెంటర్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యేలా ప్రిపేర్ అవుతున్నాం. మారుమూల పల్లెలకు సమీపంగా ఈ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటున్నది. ఎంతోమంది యువతకు బాట వేసిన ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నాం. డబ్బుల్లేని నిరుద్యోగులకు సబ్జెక్టు విషయనిపుణులు ఎంతోమందిని రప్పించి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. అధ్యాపకులు ఇచ్చే నోట్స్ ఎంతో ఉపయోగంగా ఉన్నది. పట్టుదలతో చదువుతున్నాం. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఉద్యోగ ప్రకటనలకు ఒక్కొక్కటిగా దరఖాస్తు చేసినం. వాటికి ఉన్న సిలబస్ ప్రకారం చదువుతున్నాం.
– శ్రీకాంత్, ధర్మరావుపేట
పేదరికంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆయా కుటుంబాల వారు ప్రైవేట్లో ఖర్చులు పెట్టి చదువుకోలేకపోతున్నారు. అలాంటి నిరుద్యోగులకు ఈ ఉచిత కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతున్నది. పేద కుటుంబాల పిల్లలు ఇందులో చేరి చదువుతున్నారు. రోజూ ఇంటి వద్దనుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ చాలా బాగా చెబుతున్నారు.
అధ్యాపకులు నోట్స్ కూడా ఇస్తున్నారు. వారు చెప్పే అంశాలపై దృష్టిపెడితే తప్పకుండా కొలువు సాధించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాల ప్రకటన వేస్తున్నారు. ఈ ఉద్యోగాలను ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో చదువుతున్నా.
– యమున, చిలుకమ్మనగర్
మారుమూల పల్లెల్లోని విద్యార్థులు పట్టణాలకు వెళ్లి చదువుకోవాలంటే ఇబ్బందు తప్పవు. ప్రైవేట్గా కోచింగ్ సెంటర్లకు వెళ్లి చదవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గాను సొంత గ్రామం వదిలిపెట్టి వెళ్లాలి. ఇప్పటికే ఇంటి వద్ద వివిధ పనుల్లో ఉండే వారు ఇల్లు విడిచి రెండు నెలలు ఉండాల్సి వస్తున్నది. పట్టణాలకు వెళ్లి అద్దె గదులు తీసుకోవడం, భోజనం ఖర్చులు లాంటివి కూడా చెల్లించాల్సి వస్తున్నది. ఇవన్నీ నిరుపేదలకు చాలా ఖర్చుతో కూడుకున్నవి.
అందువల్ల మారుమూల పల్లెలకు అందుబాటులోనే నర్సంపేటలోనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటున్నది. విద్యార్థులు, చదువులు పూర్తి చేసిన వారు, ఇప్పటికే ఇంకా చదువుతున్న వారు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత కోచింగ్ సెంటర్లో చదువుతున్నారు.