వనపర్తి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : మారుమూల గ్రామాల్లో గుడుంబా తయారీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నది. వీపనగండ్ల, ఖిల్లాఘణపురం, గోపాల్పేట, అమరచింత, ఆత్మకూరు, పాన్గల్ మండలాల్లో గుడుంబా వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. కాగా, జిల్లా కేంద్రం, మండల కేంద్రాలు, మారుమూల పల్లెల్లోని చిన్న దుకాణాల వరకు గుట్కా వ్యాపారం కాసులు కురిపిస్తున్నది. సారా విక్రయాలకు ముగింపు పలకాలని సీఎం కేసీఆర్ అనేకసార్లు హెచ్చరించారు. ఆరోగ్యం పాడవడంతోపాటు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని భావించిన ప్రభుత్వం గుడుంబా రహిత జిల్లాలుగా మార్చాలని సూచించింది.సారా విక్రయిస్తున్న వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించి ఉపాధి కల్పించారు. అయినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులు, ఎక్సైజ్శాఖ అధికారులకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి, గుడుంబా విక్రయాలు పెరుగుతుండడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఈ క్రమంలో వాటిని సత్వరమే అరికట్టాలని ఆదేశాలందడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. గంజాయి, గుడుంబా, డ్రగ్స్, గుట్కా, సారాకు వినియోగించే నల్లబెల్లం తదితర పదార్థాలు విక్రయిస్తున్న వారిపై నిఘా పెంచారు. ఖిల్లాఘణపురం మండలంలో గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు.
ఇతర రాష్ర్టాల నుంచి గుట్కా..
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి నిత్యం జిల్లాకు పెద్ద ఎత్తున గుట్కా వస్తున్నప్పటికీ.. అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వదిలేస్తున్నారు. బస్టాండ్లు, కూడళ్ల వద్ద దుకాణాల్లో బహిరంగంగా గుట్కా ప్యాకెట్లు వేలాడదీస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం సీరియస్ కావడంతో జిల్లా వ్యాప్తంగా గుట్కా అమ్మకాలపై నిఘా పెంచి పట్టుకుంటున్నారు. పెబ్బేరు, వనపర్తి మండలాల్లో పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో గుట్కా వ్యాపారం చేస్తున్నవారే వనపర్తికి తరలిస్తున్నారనే సమాచారం ఉన్నప్పటికీ నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు.