సూర్యాపేట టౌన్, జనవరి 21 : కొవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందించాలన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కార్యాచరణ శుక్రవారం మరింత స్పీడ్గా సాగింది. చెక్కుల పంపిణీకి అందరినీ ఒక చోటుకు చేర్చి వైరస్ వ్యాప్తికి ఆస్కారమివ్వవద్దన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం మేరకు రెండో రోజూ మొత్తం 9 వార్డుల్లో పర్యటించారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న కట్నాన్ని కాలినడకన, బైక్ మీద వెళ్లి నేరుగా అందజేశారు.
సూర్యాపేటటౌన్, జనవరి 21: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రెండో రోజూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులను అందించారు. పట్టణంలోని 9 వార్డుల్లో రూ.26,03,000 చెక్కులను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, స్థానిక నాయకుల సమక్షంలో లబ్ధ్దిదారులకు పంపిణీ చేశారు.
మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధ్దిదారులకు అందజేసి విలేకరులతో మాట్లాడారు. ఆడపిల్ల పెండ్లి భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఆడపిల్లల రక్షణకు షీటీమ్స్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని మంత్రి కోరారు.
నాలాల ఆక్రమణలపై మంత్రి సీరియస్
సూర్యాపేట పట్టణంలో నాలాల అక్రమణలపై మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా మానసనగర్కు వెళ్లగా స్థానికులు నాలా ఆక్రమణలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దానితో స్పందించిన మంత్రి పరిశీలించి అక్కడికక్కడే మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, ఇంజినీరింగ్ అధికారులను పిలిపించి తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దీంతో పట్టణ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
పార్టీ కోసం పాటుపడే ప్రతి కార్యకర్త కుటుంబానికీ టీఆర్ఎస్ అండగా ఉంటుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు క్యాంపు కార్యాలయంలో బీమా చెక్కులు, 10 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.