పరిగి, సెప్టెంబర్ 28 : వికారాబాద్ జిల్లా పరిధిలో కురిసిన భారీ వర్షాలతో తెల్లవార్లు వాగులు, వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. అన్ని మండలాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి వాగును బైక్పై దాటుతుండగా గల్లంతైన వ్యక్తి మృతదేహం బయటపడింది. రాత్రి సమయంలో వాహనదారులు వాగులు దాటకుండా ప్రత్యేకంగా పహారా ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నుంచి జిల్లాలో భారీ వర్షం కురువడంతో రాత్రి సమయంలో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి.
పూడూరులో అత్యధిక వర్షపాతం
వికారాబాద్ జిల్లా పరిధిలో పూడూరులో 89 మి.మీ., మర్పల్లి 45.7, మోమిన్పేట్ 32.3, నవాబుపేట్ 31.7, వికారాబాద్ 65.4, పరిగి 37.3, కులకచర్ల 70.3, దోమ 26, బొంరాస్పేట్ 61.9, ధారూరు 49.6, కోట్పల్లి 52.3, బంట్వారం 50.2, పెద్దేముల్ 59.6, తాండూరు 58.4, బషీరాబాద్ 37, యాలాల 78.4, కొడంగల్ 33.3, దౌల్తాబాద్ 58.7, చౌడాపూర్లో 9 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరిగా 49.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా పరిధిలో సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు 140.2 మి.మీ సాధారణ వర్షపాతం ఉండగా 233 మి.మీ వర్షపాతం నమోదైంది. తద్వారా జిల్లాలో 66 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదాలు జరుగకుండా సిబ్బంది పహారా
తాండూరు కాగ్నా నది, మంచన్పల్లి వాగు, కందనెల్లి వాగు, గాజీపూర్ వాగు, మంచన్పల్లి వాగు వద్ద నిర్మాణంలో రోడ్డు కొట్టుకుపోయి వికారాబాద్-తాండూరు మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగింది. దీంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక గ్రామపంచాయతీ కార్యదర్శి, ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక వీఆర్ఏ ప్రతి వాగు వద్ద ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో విధులు నిర్వహించారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని.. వాగులు దాటరాదని వారు సూచించారు. భారీ వర్షానికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే స్పందించేందుకు జిల్లాస్థాయిలో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
3వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
భారీ వర్షాలతో వికారాబాద్ జిల్లా పరిధిలో సుమారు 3వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయని వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లాలోని 1,340 మంది రైతులకు సంబంధించిన 2,800 ఎకరాల పత్తి, 78 మంది రైతులకు సంబంధించిన 120 ఎకరాల వరి పంట పొలాల్లో నీరు చేరింది. రెండు రోజులు వరుసగా వర్షాలు కురిస్తే పంట నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు తెలిపారు. వీటితోపాటు అక్కడక్కడ కంది పంట పొలాల్లోను నీరు చేరిందని అధికారులు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో సుమారు 3వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని అధికారులు అంచనా వేశారు.