యాచారం, అక్టోబర్21: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను నందనవనంగా మార్చారు పోలీసు సిబ్బంది. సీఐ లింగయ్య ఆధ్వర్యంలో పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ హరితహారం మొక్కలను బాధ్యతగా పెంచుతున్నారు. పోలీస్స్టేషన్ ఆవరణలో పచ్చని మొక్కలతో ఎటు చూసినా ప్రకృతి రమణీయత సంతరించుకున్నది. నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులను ఈ చెట్లు మంత్రముగ్దులను చేస్తున్నాయి. సాధారణంగా పోలీస్స్టేషన్కు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతారు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఠాణాలో ఉన్న వివిధ రకాల నీడనిచ్చే చెట్లు, డిజైన్, తీగజాతి పూలు, పండ్ల మొక్కలు అందంతో పాటుగా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పైగా కొన్ని చెట్లు ఏపుగా పెరగడంతో అన్ని కాలాల్లోనూ అవి పచ్చదనంతో పాటుగా, మండు వేసవిలో పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు చల్లని నీడనిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో గుంపులుగా స్టేషన్ భవనంలోకి వెళ్లకుండా చెట్లకింద కూర్చోని సేదతీరుతున్నారు. యాచారం పోలీస్స్టేషన్ పచ్చదనం, ప్రశాంతతతో ఇతర కార్యాలయాలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది.
మొక్కలు వృక్షాలై..
పోలీస్స్టేషన్లో హరితహారం మొక్కలను వృక్షాలుగా పెంచారు పోలీసు సిబ్బంది. గతంలో హరితహారం కార్యక్రమాలలో అప్పటి సీపీ, డీసీపీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీపీ, జడ్పీటీసీ, తహసీల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్ఐ, పోలీసు సిబ్బంది స్టేషన్ ఆవరణలో వేప, జామ, ఉసిరి, టేకు, అల్లనేరేడు, మామిడి వివిధ రకాల డిజైన్ పూలు, పండ్ల మొక్కలను సుమారు వందకు పైగా నాటారు. వాటికి పోలీసు సిబ్బంది పాదులు చేసి నిత్యం నీరు పోసి మొక్కలను వృక్షాలుగా, మరికొన్ని మహా వృక్షాలుగా పెంచారు. అవి ఏపుగా ఎదిగి అందం, ఆహ్లాదం, పచ్చదనంతో పాటుగా చల్లని నీడనిస్తున్నాయి. కొన్ని చెట్లు ఏకంగా పండ్లనిస్తున్నాయి. పోలీస్స్టేషన్ వెళ్లగానే పచ్చని ప్రకృతి పలుకరిస్తుంది. ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సీఐ లింగయ్య, ఎస్ఐలు ప్రభాకర్, పద్మయ్యలు పూర్వ పోలీస్ అధికారుల మాదిరిగానే మొక్కల పెంపకం పక్రియను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఏ ఒక్క చెట్టు ఎండిపోకుండా అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిరంతరంగా హరితహారం..
పోలీస్స్టేషన్లో మొక్కలను సంరక్షించి మరింత ఆహ్లదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం. మరిన్ని కొత్త మొక్కలను నాటేందుకు కృషి చేస్తాం. హరితమయమైన ప్రదేశంలో విధులు నిర్వహించడంతో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఒత్తిడి జయించి సిబ్బంది సైతం తమ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. స్టేషన్కు వచ్చే ప్రజలకు పచ్చని చెట్లు ఎంతో ప్రశాంతతనిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కల పెంపకంతో అందం, ఆహ్లదంతో పాటుగా నీడ తదితర ఉపయోగాలున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంటిముందు మొక్కల పెంపకం చేపట్టాలి.
-లింగయ్య, సీఐ యాచారం