చెంచు చిన్నారులు, కిశోర బాలికల సంక్షేమంతోపాటు వారికి పౌష్టికాహారం అందించే సంకల్పంతో ప్రభుత్వం ‘గిరి పోషణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారిలో ఎదుగుదల లోపాన్ని అధిగమించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లాను ఎంపిక చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా చెంచుల పిల్లలు ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఇక్రిశాట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నాయి. జిల్లాలోని 24 అంగన్వాడీ కేంద్రాల్లో నవంబర్ ఒకటో తేదీ నుంచి పౌష్టికాహారం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెంచుల పిల్లలతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లోని ఇతరులకు సైతం గిరి పోషణ కింద పౌష్టికాహారం అందజేయనున్నారు. ఇది పిల్లల ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది.
పరిగి, అక్టోబర్ 17 : చెంచుల సంక్షేమంతోపాటు వారికి పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో సర్కారు ‘గిరి పోషణ’ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. చిన్నారులు, కిశోర బాలికల్లో ఎదుగుదల లోపాన్ని గుర్తించిన సర్కారు, వారికి చక్కటి పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా ఎదుగుదలకు తోడ్పాటునందించనుంది. ఇందుకుగాను చెంచుల పిల్లలు గల అంగన్వాడీ కేంద్రాల్లో వారితోపాటు ఇతర చిన్నారులకు సైతం పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులుగా పది జిల్లాలను ఎంపిక చేయగా, అందులో వికారాబాద్ జిల్లా సైతం ఉన్నది. జిల్లావ్యాప్తంగా చెంచుల పిల్లలున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ‘గిరి పోషణ’ కార్యక్రమం అమలు చేస్తుంది. ఇందుకు సంబంధించి వారికి పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఇక్రిశాట్ సహకారంతో ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. వికారాబాద్ జిల్లా పరిధిలోని 24 అంగన్వాడీ కేంద్రాల్లో నవంబర్ 1 నుంచి ‘గిరి పోషణ’ అమలు కోసం అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు.
జిల్లాలో పూర్తిస్థాయి సర్వే
వికారాబాద్ జిల్లా పరిధిలో 969 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 138 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో 232 మంది విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. ఆయా వయస్సుల్లో ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువు ఉన్నారు. దీంతో చెంచు పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఏకైక లక్ష్యంతో ‘గిరి పోషణ’ కార్యక్రమం అమలు చేయనుంది. జిల్లా పరిధిలోని 24 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. 3 నుంచి 5 ఏండ్ల లోపు చిన్నారులుకాగా.. అందులో 190 మంది చెంచులు, 11 మంది ఇతర ఎస్టీలు, ఎస్టీలు కానివారు 402 మంది ఉన్నారు. కిశోర బాలికల్లో 374 మంది చెంచులుండగా ఇతర ఎస్టీలు 27, ఎస్టీలు కానివారు 675 మంది ఉన్నారు. గర్భిణులు 140 మందికాగా.. వారిలో 74 మంది చెంచులు, ఐదుగురు ఇతర ఎస్టీలు ఉన్నారు. తల్లులు 144 మందికిగాను 58 మంది చెంచులున్నారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని 24 కేంద్రాల్లో 2,101 మందికి పౌష్టికాహారం అందిస్తారు.
అమలు చేసే అంగన్వాడీ కేంద్రాలు
వికారాబాద్ జిల్లా పరిధిలోని పూడూరు మండల పరిధిలో సోమన్గుర్తి, చెంచుపల్లి, వికారాబాద్ మున్సిపల్ పరిధిలో వికారాబాద్ పట్టణం, చెంచుపల్లి, బొంరాస్పేట్ మండలంలోని బొంరాస్పేట్, వడిచెర్ల, దోమ మండలంలోని మోత్కూర్ చెంచుపల్లి, చంద్రగుట్ట, పరిగి మండలంలోని గడిసింగాపూర్, కులకచర్ల మండలంలోని అనంతసాగర్, అంతారం, బండెల్కిచర్ల, చాపలగూడెం, చెల్లాపూర్, కుస్మసంద్రం-1, బురెడ్డిపల్లి, పీరంపల్లి, రాంరెడ్డిపల్లి, రాంపూర్, సాల్వీడ్, బొంరెడ్డిపల్లి, బషీరాబాద్ మండలంలోని జలాల్పూర్, పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో ‘గిరి పోషణ’ను అమలు చేస్తారు.
అవగాహన కార్యక్రమాలు
గిరి పోషణ కార్యక్రమం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించే అంశంపై అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలకు ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు ఎలాంటి ఆహారం తయారు చేసి పెట్టాలన్నది పూర్తిస్థాయిలో అవగాహన కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించారు. బాలలు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తారు. పౌష్టికాహారంలో భాగంగా ఉదయం అల్పాహారంగా జోవర్ మీల్, మల్టీ గ్రెయిన్ మీల్, మల్టీ గ్రెయిన్ స్వీట్ మీల్ అందజేస్తారు. సాయంత్రం స్నాక్స్గా జోవర్ బైట్స్, పీనట్, నువ్వుల చిక్కి, పీనట్-ప్రైడ్గ్రామ్ చిక్కి అందజేస్తారు. వీటితోపాటు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం సైతం ఆయా కేంద్రాల్లో అమలు చేస్తారు.
పౌష్టికాహారం తయారీకి అవసరమైన పాత్రలు, ఇతర సామగ్రి ఈ నెలాఖరు లోపు ఆయా అంగన్వాడీ కేంద్రాలకు అందజేస్తారు. నవంబర్ 1 నుంచి ‘గిరి పోషణ’ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఇందుకు సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంపిక చేసిన కేంద్రాల్లో పౌష్టికాహారం