రూ.7.63 కోట్ల నష్టపరిహారం మంజూరు
ఎమ్మెల్యే జైపాల్యాదవ్
కాలువ నిర్మాణ పనుల పరిశీలన
ఆమనగల్లు, ఏప్రిల్15: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని సింగంపల్లి, పోలేపల్లి గ్రామాల్లో ఎత్తిపోతలకు సంబంధించిన కాల్వ పనులను ఈఈ శ్రీకాంత్, డీఈ షర్మీలతో కలిసి ఆయన పరిశీలించారు. నష్టపరిహారం అందలేదని రైతులు పనులకు ఆటంకం కల్పిస్తున్నారని అధికారులు ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆయా గ్రామాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో డీ-82 కాల్వ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం కింద ప్రభుత్వం రూ.7.63 కోట్లు మంజురు చేసిందని, రైతులు ఆందోళన పడకూడదన్నారు. అందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు ఎత్తిపోతల పనులు చురుకుగా కొనసాగుతున్నాయని వానకాలం పంట వరకు సాగునీరు అందనుందని రైతులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్ ప్రేమలత, నాయకులు నర్సింహ, రమేశ్, భాస్కర్ తదితరలు పాల్గొన్నారు.