సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర శుభ ఘడియలకు సిద్ధమవడమే భోగి. చెడును తగులబెట్టి మంచిని ఆహ్వానించడమే ఈ పండుగ పరమార్థం. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ కనుక దీనిని భోగి అంటారు. పచ్చటి పంటలు.. పడుచుల ఆటలు.. ఊరూరా భోగి మంటలు.. వాకిళ్లకు రంగుల సింగారాలు.. తెలుగు లోగిళ్లు వెలుగు పూలై విరిసే సంక్రాంతి సంబురాలు రానే వచ్చాయి. మూడు రోజుల పాటు ఇంటిల్లిపాది వైభవంగా జరుపుకునే వేడుకలు నేడు ఆరంభం కానున్నాయి.
పుష్యమాసం శుక్రవారం భోగి పండుగను జరుపుకునేందుకు సకలజనులు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. తొలి రోజు భోగి. మలి రోజు శనివారం సంక్రాంతి. ఆఖరు రోజు ఆదివారం కనుమ పండుగగా జరుపుకుంటాం.. సూర్యుడి గమనానికి ప్రతిరూపంగా జరుపుకునే పండుగనే సంక్రాంతిగా భావిస్తాం. మనం నిర్వహించుకునే ప్రతి పండుగలోనూ, చేసే ప్రతి పూజలోనూ ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుందన్నది సత్యం. దక్షిణాయణం చివరి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. దీంతో సూర్యరశ్మి తగినంత ఉండక, క్రిమి కీటకాలు నశించవు.. ఈ క్రమంలోనే మహిళలు పెండ (పేడ) నీళ్లతో ఇళ్లన్నీ అలికి శుభ్రం చేసి సుద్ద లేదా బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. వీటి ప్రభావంతో క్రిమి కీటకాలు నశిస్తాయి. ముగ్గుల మీద పెండ ముద్దలుంచి, పసుపు కుంకుమలు పెట్టి బంతి, చేమంతి మొదలైన పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలు అంటారు. వేకువజామునే హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణాలు వీనులవిందు చేస్తాయి. భోగి రోజు గోదాదేవి కల్యాణం కమనీయంగా జరిపిస్తారు. పది రోజుల ముందు నుంచే ఇళ్లల్లో రుచికరమైన పిండి వంటలు తయారు చేసుకోవడం మొదలు పెడుతారు. అత్తవారింటికి కొత్త అల్లుళ్లు వచ్చి రాచమర్యాదలు అందుకుంటారు.
భోగ భాగ్యాల భోగి ..
దక్షిణాయణం దేవతలు నిద్రించిన కాలం కావడంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడ నివారణకు ఇంట్లోని పురాతన వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేస్తారు. ఈ రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. భోగి రోజున తెల్లవారు జామున పిల్లలకు తలారా స్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. భోగి పండ్లను పెద్దలతో పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి. భోగి రోజే గోదాదేవి రంగనాథస్వామిని వివాహమాడింది. అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజు మహిళలు వాకిళ్లను రంగు రంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పళ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు.
మకర సంక్రాంతి
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పరిభ్రమిస్తాడు. దీనినే ఉత్తరాయణంగా చెబుతారు. ఇది మహా పుణ్యకాలం. ఏ శుభకార్యానికైనా మంచిది. అందుకే సంక్రాంతి మహత్తరమైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి. సంక్రాంతి నాడు పితృదేవతలకు తర్పణం విడుస్తారు. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం గుమ్మడికాయ దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో పాయసం చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెడుతారు. మహిళలు ముగ్గులు వేయడం, పిండి వంటలు చేయడంలో నిమగ్నులవుతే, చిన్నారులు పతంగులు ఎగురవేస్తారు. పురుషులు కోడి పందాలతో సరదాగా గడుపుతారు.
అందాల లోగిలి.. ఆరోగ్యదాయిని..
ముగ్గు ఆచారం. ఇంటికి అందం. అంతకు మించి ఇంటిల్లిపాదికీ ఆరోగ్యప్రదం. అందుకే కంప్యూటర్ యుగంలోనూ మగువలు ముగ్గులు వేసే సంప్రదాయాన్ని మరువలేదు. ఈ ధనుర్మాసంలో సంక్రాంతి సీజన్లో ఏ వీధి చూసినా నయనానందకరమైన ముగ్గులు మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి. పక్కింటి వాళ్లకంటే మన ముగ్గే బాగుండాలన్న పోటీతత్వం మహిళల్లో కనిపిస్తుంటుంది. రంగవల్లులను వేయడం తమ సృజనాత్మకతకు పరీక్షగా భావిస్తుంటారు. సంక్రాంతి నేపథ్యంలో ముగ్గు వేయడం వల్ల కలిగే ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు. ముగ్గు వేసే సంప్రదాయం ఒక్క మనకే కాదు. హైందవ సంస్కృతికి సంకేతంగా దేశవిదేశాల్లోనూ ఉంది. మనదేశంలోని అన్ని రాష్ర్టాల్లో రంగవల్లుల పండుగను జరుపుకుంటారు. మహిళల సృజనాత్మకశక్తికి ప్రతీకగానూ నిలిచే ముగ్గు 64 కళలలో ఒకటని చెబుతారు.
రైతుల పండుగ కనుమ
భోగి, సంక్రాంతి పండుగల తర్వాత రోజు జరుపుకునే పండుగ కనుమ. దీనిని రైతులు ఘనంగా జరుపుకుంటారు. పశువులను అలంకరించి గోప్రదక్షిణం చేస్తారు. ఆ రకంగా వాటి రుణాన్ని తీర్చుకున్నట్లు భావిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడుతారు. కొత్త ధాన్యాలతో పొంగలి వండి దేవుడికి ప్రసాదంగా నివేదిస్తారు. కనుమ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల బండ్లతో ఊరేగిస్తారు.