న్యూఢిల్లీ: చైనా తరహాలో ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేలో ‘నెయిల్ హౌస్’ ప్రతిఘటన ఎదురైంది. హైవే నిర్మాణం కోసం తన స్థలాన్ని ఇచ్చేందుకు ఒక యజమాని నిరాకరించాడు. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో ఆ బిల్డింగ్ స్థలాన్ని వదిలేసి రోడ్డు నిర్మాణాన్ని కొనసాగించారు. (nail house resistance) ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి 2.5 గంటలు తగ్గించేందుకు 213 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్వే నిర్మించారు. ఏప్రిల్ 14న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
కాగా, ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని మండోలా గ్రామం వద్ద ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే మధ్యలో ఒక ఇల్లు అడ్డుగా ఉన్నది. ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇది నిలిచింది. అయితే 1998 నుంచి ఈ ఇంటిపై భూ వివాదం కొనసాగుతున్నది. మండోలా హౌసింగ్ స్కీమ్ కోసం ఉత్తర ప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ తన భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని యజమాని అయిన దివంగత డాక్టర్ వీర్సేన్ సోరోహా నాడు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. అధిక పరిహారాన్ని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ హౌసింగ్ స్కీమ్ పూర్తి కాలేదు.
మరోవైపు 2020లో ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) భూ సేకరణ చేపట్టింది. ప్రస్తుతం సోరోహా మనవడు లక్ష్యవీర్ సోరోహా యాజమాన్యంలో ఉన్న ఆ భూమి సేకరణకు అధికారులు ప్రయత్నించగా అతడు నిరాకరించాడు.
కాగా, తన ఇంటిని కూల్చివేసే ముప్పు ఉందని పేర్కొంటూ లక్ష్యవీర్ 2024లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఎటువంటి కూల్చివేతలు లేదా తదుపరి నిర్మాణాలను చేపట్టరాదని, యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది.
మరోవైపు కోర్టు వ్యవహారం నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ అధికారులు ఆ ఇంటిని వదిలేసి నాలుగు వైపులా హైవే నిర్మాణ పనులు పూర్తి చేశారు. దీంతో హైవే మధ్యలో ఆ ఇల్లు ఒంటరిగా మిగిలింది. యజమాని నోయిడాలో నివసిస్తుండగా ఖాళీగా ఉన్నది. అక్కడ సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉంటున్నాడు. ‘ఇల్లు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. నేను ప్రతిరోజూ దాన్ని శుభ్రం చేస్తాను. ఎక్స్ప్రెస్వే ప్రారంభమైన తర్వాత ట్రాఫిక్ శబ్దాలు భరించడం చాలా కష్టంగా ఉంది’ అని మీడియాతో అన్నాడు.

China Nail House
అయితే చైనాలోని ‘నెయిల్ హౌస్’ ప్రతిఘటనను ఇది గుర్తు చేసింది. 2025లో తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లోని జిన్సీ కౌంటీలో హైవే నిర్మాణం సందర్భంగా తన భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఒక ఇంటి యజమాని నిరాకరించాడు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని అలాగే వదిలేసి దాని చుట్టూ హైవేను నిర్మించారు. అయితే అధిక పరిహారం డిమాండ్ చేసిన ఆ ఇంటి యజమాని ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. నిరంతర ట్రాఫిక్ శబ్దాలతో అక్కడ నివసించలేకపోతున్నాడు. ఆ ఇంటిని అమ్ముకోలేక అక్కడ నివసించలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాడు.