సుమారు రెండేండ్లుగా అందరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కొవిడ్ మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టీకాస్త్రం’ వేగంగా పనిచేస్తోంది. పకడ్బందీగా తీసుకున్న చర్యలతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో భౌతికదూరం, మాస్కుల వాడకంపై ప్రభుత్వం ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించింది. గత ఏడాది జనవరి నాటికి టీకా అందుబాటులోకి రావడంతో ప్రణాళికాబద్ధంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది జనవరి 16 నాటికి టీకాల పంపిణీ ఏడాది పూర్తి చేసుకోగా… ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 31.13 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులను అందించారు. సింగిల్, డబుల్ డోసు తీసుకున్నవారు నిజామాబాద్ జిల్లాలో 19.56 లక్షల మంది, కామారెడ్డి జిల్లాలో 11.57లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం బూస్టర్ డోసుతోపాటు మొదటి, రెండు డోసుల టీకా పంపిణీని సమన్వయంతో చేపడుతుండగా, ఇప్పటివరకు 15 నుంచి 17 ఏండ్ల వయస్సు ఉన్న 73,114 మంది టీనేజర్లకు వ్యాక్సిన్ అందించడం గమనార్హం.
నిజామాబాద్, జనవరి 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. రెండేండ్లుగా ప్రజల ప్రాణాల రక్షణ కోసం పాటుపడుతున్నది. 2020 ప్రారంభం నుంచి మొదలైన వైరస్ వ్యాప్తిని అడుగడుగునా అడ్డుకుంటున్నది. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యూహా లు రచించి అమలుచేస్తున్నది. వ్యాక్సిన్ అందుబాటులో లేని సమయంలో భౌతిక దూరం, మాస్కుల వాడకంతో ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. మొదటి వేవ్ నుంచి ఎదురైన సవాళ్లను రెండో వేవ్లో పటిష్టవంతంగా ఎదుర్కొంది. 2021 జనవరి నాటికి అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలను సైతం పకడ్బందీగా ప్రజలకు చేరువ చేసింది. రద్దీని నియంత్రిస్తూనే ప్రణాళికాబద్ధంగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టింది. 2022 జనవరి 16 నాటికి టీకాల పంపిణీ ఏడాది పూర్తి చేసుకోగా… ఇప్పటి వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అర్హులైన వారికి టీకాలు వేశారు. నిజామాబాద్లో 19.56లక్షలు, కామారెడ్డి జిల్లాలో 11.57లక్షల మందికి కొవిడ్ టీకా అందించారు. ప్రస్తుతం బూస్టర్ డోసుతోపాటు మొదటి, రెండు డోసుల టీకాల పంపిణీని సమన్వయంతో చేపడుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 19లక్షల 56వేల 408 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో మొదటి డోసు 11లక్షల 50వేల 960 మంది, రెండో డోసు 8లక్షల 2వేల 559 మంది తీసుకున్నారు. బూస్టర్ డోసు 2,889 మంది స్వీకరించారు. మొత్తం 226 బృందాలు వ్యాక్సినేషన్లో పాల్గొంటున్నాయి. రెండు ప్రైవేటు దవాఖానల్లో వ్యాక్సిన్ కేంద్రాలు ఉండగా మిగిలినవి సర్కారు ఆధ్వర్యంలోని కేంద్రాలే ఉన్నాయి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 8లక్షల 87వేల 672 మంది పురుషులు, 10లక్షల 65వేల 579 మంది మహిళలున్నారు. కొవిషీల్డ్ 17లక్షల 92వేల 775 మంది, లక్షా 63వేల 633 మంది కొవాగ్జిన్ తీసుకున్నారు.18-44 వయస్సు కలిగిన వారు 11లక్షల 26వేల 718 మంది, 45-60 వయస్సులోపు 4లక్షల 99వేల 879 మంది, 60 సంవత్సరాలు పైబడిన వారు 2లక్షల 81వేల 187 మంది, 15-17 వయస్సువారు 48వేల 772 మందికి వాక్సినేషన్ పూర్తయ్యింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అత్యధిక మందికి టీకా అందించిన కేంద్రంగా నిలిచినట్లుగా జీజీహెచ్ బాధ్యులు వెల్లడించారు. ఏడాది కాలంగా వైద్య బృందాలు పెద్ద ఎత్తున టీకా పంపిణీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలో…
కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 11లక్షల 57వేల 190 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో మొదటి డోసు 6లక్షల 72వేల మంది, రెండో డోసు 4లక్షల 81వేల 948 మంది తీసుకున్నారు. బూస్టర్ డోసు 3,242 మంది తీసుకున్నారు. మొత్తం 166 బృందాలు వ్యాక్సినేషన్లో పాల్గొంటున్నాయి. సర్కారు ఆధ్వర్యంలోని కేంద్రాలే ఉన్నాయి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 5లక్షల 35వేల 233 మంది పురుషులు, 6లక్షల 18వేల 512 మంది మహిళలున్నారు. కొవిషీల్డ్ 10లక్షల 75వేల 998 మంది, 81వేల 192 మంది కొవాగ్జిన్ తీసుకున్నారు.18-44 వయస్సు కలిగిన వారు 6లక్షల 31వేల 434 మంది, 45-60 వయస్సులోపు 3లక్షల 14వేల 892 మంది, 60 సంవత్సరాలు పైబడిన వారు లక్షా 86వేల 522 మంది, 15-17 వయస్సువారు 24వేల 342 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లాలో పురుషులతో పోలిస్తే మహిళలే ముందుండి వ్యాక్సిన్ తీసుకున్నారు. 15-17 ఏండ్లు వయస్సు వారికి టీకాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. బూస్టర్ డోసు సైతం అర్హులైన వారికి అందిస్తున్నారు. టీకాలు అందరికీ అందించాలనే లక్ష్యంతో మూడు నెలల నుంచి ఇంటింటికీ వైద్య బృందాలు ఇంటింటికీ తిరుగుతూ టీకా అందించాయి.
అపోహ వీడి.. వ్యాక్సిన్కు కదిలి..
కరోనా నుంచి బయట పడేందుకు ప్రపంచ దేశాల్లో చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం.. అదే టీకాస్త్రం. మనదేశం లో అనుమతి పొందిన నాలుగైదు టీకాల్లో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు టీకాలనే అత్యధిక మంది తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రెం డు టీకాలకే ప్రాధాన్యం ఇస్తోంది. సాధారణ ప్రజలు ఇప్పటికీ టీకా తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ధైర్యంగా ముం దుకొచ్చి టీకా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నప్పటికీ కొంత మంది ముందుకురావడంలేదు. కొద్ది మంది అవగాహన లేక, అసత్య ప్రచారాన్ని నమ్మి టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మొ దట్లో టీకా కోసం చాలా మంది ముందుకు రాలేదు. ప్రస్తుతం కాస్త అవగాహన తెచ్చుకుని టీకా ఇప్పించుకునేందుకు తరలి వస్తున్నారు. సెకండ్ వేవ్లో కొవిడ్ ఉధృతి, వైరస్ సృష్టించిన నష్టంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినప్పటికీ గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం టీకాపై ప్రచారాన్ని సైతం విస్తృతం చేసింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కొవిడ్ టీకా పూర్తిగా సురక్షితమని, ఎలాంటి ఇబ్బంది ఉండదని, టీకానే కొవిడ్ నివారణకు అస్త్రమంటూ సర్కారు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది.