ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస గుప్తా అత్యాధునిక అంబులెన్స్ను విరాళంగా అందజేశారు. ఈ అంబులెన్స్ను తార్నాకలోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ఎదుట మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తన పిలుపుకు స్పందించి అంబులెన్స్ను అందజేసినందుకు ఉప్పల శ్రీనివాస్ గుప్తాను అభినందించారు. పేదలకు అండగా నిలిచేందుకు మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఐసీయూ యూనిట్, వెంటిలేటర్తో సహా అన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న అంబులెన్స్ను రూ.25 లక్షలతో తయారు చేయించినట్లు చెప్పారు.
ఇప్పటికే ఉప్పల ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు మూడు వేల మంది వధువులకు పుస్తె, మెట్టెలు, వేలాది మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు రెండు లక్షల మందికి పైగా అన్నదానం చేశానని వివరించారు.
పద్నాలుగు వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేయడంతో పాటు వేలాది మంది ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్కు శానిటేషన్ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. కేటీఆర్ స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసూరి సునీత, టీఆర్ఎస్ యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.