జ్యోతినగర్, మార్చి 24: ఏపీ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం తెలంగాణ అవసరాల కోసం తెలంగాణకు కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేస్-1 కింద ఎన్టీపీసీలో నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు వెలుగులు స్వరాష్ర్టానికి చేరాయి. ప్రథమంగా 800మెగావాట్ల ఒకటో యూనిట్లో విద్యుదుత్పత్తి జరిగింది. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో యూనిట్లో విద్యుత్ నమోదు కాగా, శుక్రవారం మధ్యాహ్నం నాటికి 104.9మెగావాట్ల విద్యుతుద్పత్తి నమోదైనట్లు యాజమాన్యం వెల్లండించింది. గురువారం అర్ధరాత్రి ప్రాజెక్ట్లో విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా, యూనిట్ అధికారులు, సిబ్బంది ఉత్పత్తి సక్సెస్ సంబురాలు జరుపుకున్నారు.
2016 జనవరి 29న జీరో తేదీతో నిర్మాణ పనులు చేపట్టగా, ఏడేండ్లకు ప్రాజెక్టు ఉత్పత్తిలోకి వచ్చింది. రెండేళ్ల కాలంలో కరోనా నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైనా ఏడాది నుంచి పనులను అధికార యంత్రాంగం శరవేగంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రథమంగా 800మెగావాట్ల 1వ యూనిట్ను ఉత్పత్తిలోకి తీసుకువచ్చారు. గత కొన్ని రోజులపాటు యూనిట్లో ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ చేపట్టి, సాంకేతిక సమస్యలను అధిగమించారు. ఎట్టకేలకు యూనిట్ను ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నమోదవుతున్నది. ఈ క్రమంలోనే యాజమాన్యం ఈ పవర్ను గ్రిడ్కు అనుసంధానం చేసింది. 800 మెగావాట్ల మరో రెండో యూనిట్ పనులు కూడ వేగవంతమవుతున్నాయి. సాంకేతిక సమస్యలను అధిగమించి మరో ఐదు నెలలకు రెండో యూనిట్ను కూడా ఉత్పత్తిలోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణ పరిరక్షణ అనుకూలంగా దక్షణ భారత దేశంలోనే మొదటి సారిగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను వినియోగించారు. అత్యున్నతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీని స్టీమ్ జనరేటర్ కోసం నిర్మించారు. దీని సామర్ధ్యం పారామీటర్స్ 603 డిగ్రీ, 281 కేజీ, చ.సెం.మీ కలిగి ఉన్నది. ఇది బొగ్గు వినియోగం, వాయి కాలుష్యాన్ని భారీగా తగ్గించడం, గ్రీన్హౌస్ వాయివు విడుదలలో కూడా తగ్గుదల చూపునున్నది. ఇక స్విచ్యార్డు నిర్మాణం జీఐయస్ సమీకృత స్వచ్యార్డు విధానాన్ని ఉపయోగించారు. దీంతో భూమి వినియోగం తక్కువైంది. అలాగే 800మెగావాట్ల రెండు యూనిట్లకు గాను ఒకే చిమ్నీని నిర్మించారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో 275 మీటర్ల ఎత్తులో చిమ్నీ నిర్మాణం జరిగింది.
అత్యంత సూపర్ క్రిటిక్ టెక్నాలజీతో చేపట్టిన తెలంగాణ ప్రాజెక్టు వ్యయం 10,598.98 కోట్లు. నీటి వసతి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా 2 టీఎంసీల నీరు. సింగరేణి సంస్థ నుంచి బొగ్గు లింకేజీ, ప్లాంట్ మెయిన్ నిర్మాణం పనులు, స్టీమ్ జనరేటర్ను బీహెచ్ఇఎల్ కంపెనీ చేపట్టగా, టర్బన్ జనరేటర్ను అల్స్టోం(జీఇ)కంపెనీ, బీఓపీ పనులను టాటా కంపెనీ చేపట్టింది.
విద్యుదుత్పత్తి సక్సెస్ నేపథ్యంలో అధికారులు కంట్రోల్ గదిలో విజయోత్సవ సంబురాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కాగా, ప్రాజెక్టుకు ఇటీవలే ఎన్టీపీసీకి సింగరేణి నుంచి చేసుకున్న 4.0 లక్షల మెట్రిక్ టన్నుల ఎంఓయూ బొగ్గును ప్రాజెక్టుకు సరఫరా చేయడంతో 1వ యూనిట్లో ట్రయల్న్ల్ర పక్రియ సక్సె అయిం ది. దీంతో యూనిట్ను ఉత్పత్తి దశలోకి తెచ్చేందుకు ఈ నెల 14న అధికారులు యుద్ధప్రాతిపదికన లైటాఫ్ చేశారు. వారం రోజుల అనంతరం యూనిట్లో విద్యుదుత్పత్తి నమోదైంది.