మారుతున్న కాలానికి అనుగుణంగా టీఎస్ ఆర్టీసీ కొత్తపుంతలు తొక్కుతున్నది. ప్రస్తుతం అందుతున్న నాణ్యమైన సేవలకు సాంకేతికతను జోడించి ప్రయాణిలకు చేరువవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాత బస్సుల స్థానంలో అత్యాధునిక ఫీచర్లున్న సూపర్లగ్జరీ, డీలక్స్, స్లీపర్ వంటి బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నది. వరంగల్ రీజియన్కు 36 కొత్త బస్సులను కేటాయింగా, నాలుగు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వరంగల్-1, వరంగల్-2 డిపోలకు ఒక్కో బస్సు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రెండు చొప్పున కేటాయించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ అత్యాధునిక హంగులతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్న సీఎం కేసీఆర్ సూచనలతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది. సూపర్లగ్జరీ, డీలక్స్, స్లీపర్ బస్సులను కొనుగోలు చేసింది. హైదరాబాద్ తర్వాత రెండో పెద్దనగరమైన వరంగల్ రీజియన్ పరిధిలో విడుతల వారీగా వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఈ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. మార్చి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
వరంగల్ రీజియన్కు మొత్తం 36 కొత్త బస్సులకు గాను 4 వచ్చాయి. వరంగల్-1, వరంగల్-2 డిపోలకు ఒక్కో బస్సు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రెండు చొప్పున కేటాయించారు. అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లడానికి బస్సులు బుక్ చేసుకోవడంతో ఆయా డిపోలకు వీటిని పంపించారు. ముందుగా హైదరాబాద్లో ఈ నూతన బస్సులు తిరుగ నుండగా, ఈ నెల 8 నుంచి శబరిమలకు వెళ్లనున్నాయి. వరంగల్ రీజియన్కు ఇంకా సూపర్ లగ్జరీ బస్సులతో పాటు స్లీపర్, డీలక్స్ బస్సులు 30కిపైగా మార్చిలోగా రానున్నాయి.
సూపర్లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాకింగ్ సిస్టంతోపాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వీటిని ఆర్టీసీ కంట్రోల్రూమ్కు అనుసంధానం చేస్తారు. బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్ను నొక్కగానే ఆర్టీసీ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరి, అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిైక్లెనింగ్ సీట్లు ఉంటాయి. ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత కోసం బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటుతోపాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్డీఏఎస్)ను ఏర్పాటు చేశారు. బస్సులో మంటలు చెలరేగగానే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినా అలారం ఆటోమెటిక్గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ఫోన్ చార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీని ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్ రీజియన్కు అత్యాధునికమైన హంగులు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన నాలుగు సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి. ఇందులో సీసీ కెమెరాలు, ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. మార్చిలోగా సూపర్ లగ్జరీ, స్లీపర్, డీలక్స్ 30కిపైగా కొత్త బస్సులు రావాల్సి ఉంది. ప్రస్తుతం 4 సూపర్ లగ్జరీ బస్సులు వరంగల్-1, వరంగల్-2 డిపోలకు ఒక్కో బస్సు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రెండు కేటాయించాం. ముందుగా హైదరాబాద్లో తిప్పుతున్నాం. తర్వాత అయ్యప్పల కోసం శబరిమలకు సూపర్ లగ్జరీ బస్సులను నడిపిస్తాం.
– జే శ్రీలత, వరంగల్ రీజినల్ మేనేజర్